National Blood donation Day: అభిమానులను హీరోలు అభిమానులుగానే కాకుండా సమాజ సేవకులుగా, వారికో గౌరవం తీసుకొచ్చే బాధ్యత తీసుకున్న హీరో దేశంలో ఎవరైనా ఉన్నారా..? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ‘చిరంజీవి’ మాత్రమే. జనరేషన్ మారిన తర్వాత కాకుండా.. తన ప్రైమ్ టైమ్ లోనే అభిమానులను బ్యానర్లు, కటౌట్లు కట్టడం కంటే సమాజ సేవ ముఖ్యమని మలచడం అత్యంత అరుదైన విషయం. హీరోల పేరు మీద సేవా కార్యక్రమాలు చేసే అభిమానులున్నారు కానీ.. హీరోనే అభిమానులను సేవా మార్గంలో పయనించేలా చేయడం.. అభిమానులూ తమ హీరో మాటే శిరోధార్యంలా భావించి.. దశాబ్దాలుగా సేవా మార్గంలో పయనించడం మరీ అరుదు. ఇవన్నీ సాధ్యమైంది మెగాభిమానులతో.. సుసాధ్యం చేసింది మెగాస్టార్ చిరంజీవి. ఆ సేవా కార్యక్రమే ‘రక్తదానం’. నేడు ‘National Voluntary Blood Donation Day’.
ఓ దినపత్రికలో.. రక్తం అందక ఒక ప్రాణం పోయిందనే వార్త చిరంజీవిని కదిలించింది. దీంతో చిన్ననాటి నుంచి ఉన్న సేవా మార్గమే మెగాస్టార్ అయ్యాక కూడా కొనసాగింది. రేపటికి (అక్టోబర్ 2, 1998) 27ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్టు’ అలా ప్రారంభించిందే. రక్తం అందక ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో చిరంజీవి ప్రారంభించిన ట్రస్టు ‘చిరంజీవి బ్లడ్ బ్యాంకు’గా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టింది. ‘రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి’ అని చిరంజీవి 1998లో ఇచ్చిన పిలుపు నేటికీ అభిమానుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఫలితంగా లక్షలాది మంది అభిమానులు ఇన్నేళ్లలో రక్తదానం చేశారు. ఊరూ వాడా.. అభిమానులు చిరంజీవి పుట్టినరోజుకి సైతం బ్లడ్ బ్యాంకు స్థాపించి రక్తదానం చేయడం.. చేయించడం చేస్తూ రక్తం సేకరించి చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు అందేలా చేశారు.
నేటికి నిరంతరంగా కొనసాగుతున్న బ్లడ్ బ్యాంక్ ద్వారా 15లక్షలకు పైగా యూనిట్ల రక్తం సేకరించారు. చిరంజీవి సొంత నిధులతో రక్తం ఎవరికి ఎక్కడ అవసరం ఉన్నా అందేలా చేస్తున్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలోనే ఇన్నేళ్లలో దాదాపు 20లక్షల మందికి.. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలలో దాదాపు 15లక్షల మందికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం అందంచి ప్రాణాలు నిలిపింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. చిరంజీవి పిలుపుకి స్పందించి 50, 100సార్లు రక్తదానం చేసిన వారున్నారు. అత్యధికంగా రక్తదానం చేసిన వారికి చిరంజీవి ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు. బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసిన వారికి చిరంజీవి. రామ్ చరణ్ సంతకం చేసిన సర్టిఫికెట్ తోపాటు ఐడెంటిటీ కార్డు ఇస్తున్నారు. ఈ కార్డుతో ఏడాదిపాటు ఆపదలో ఉన్నవారికి ఇక్కడ నుంచి రక్తం అందించవచ్చు.
చిరంజీవి-పవన్ కల్యాణ్-రామ్ చరణ్ పుట్టినరోజున మెగాభిమానులు చేపట్టే రక్తదానంతో నిల్వ సామర్ధ్యానికి మించి వస్తున్నప్పుడు హైదరాబాద్ లో ఉస్మానియా, నిమ్స్ తదితర ప్రభుత్వాసుపత్రులకు రక్త నిల్వవలను మళ్లిస్తున్నారు. అత్యధిక రక్తదాతలతో ప్రతి మూడు నెలలకు ఓసారి చిరంజీవి సమావేశమవుతున్నారు. ఎన్నోసార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ‘బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అవార్డు’ వచ్చింది. తమిళనాడులో హీరో సూర్య చేసే సేవా కార్యక్రమాలకూ ఆదర్శమైంది. కుత్సిత మనస్తత్వంతో విమర్శలు చేసిన వారికి కోర్టు తీర్పులతోనూ చిరంజీవి బ్లడ్ బ్యాంకు గొప్పదనం తెలిసింది. నేటి జాతీయ రక్తదాతల దినోత్సవం.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు 27ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రక్తదాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ మహత్కార్యానికి వెన్నెముకగా నిలుస్తున్న చిరంజీవికి మనఃపూర్వక అభినందనలు తెలియజేయాల్సిందే.
