నూతన విద్యా విధానంకు సంబంధించి 30ఏళ్ల తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. నర్సరీ నుంచి పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చాం. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నూతన విద్యా విధానంపై ఎంత ఎక్కువగా చర్చ జరిగితే దేశానికి అంత ప్రయోజనం ఉంటుంది. 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెచ్చాం. కొత్త విద్యావిధానం భావితరాలకు, దేశానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది’.
‘విద్యా విధానంలో సంస్కరణలు తీసుకువస్తూ ముందుకెళ్లాలి. ప్రస్తుతం యువతకు నైపుణ్యాలు ఎంతో అవసరం. గతంలో ఉన్న శిక్షణ వ్యవస్థ పూర్తి సాధికారత సాధించలేదు. ఏం ఆలోచిస్తున్నారనే దాని నుంచి ఎలా ఆలోచిస్తున్నారనే దానిపై దృష్టి సారించాలి. పిల్లలకు ఐదో తరగతి వరకు మాతృభాషలోనే చదువుకు వెసులుబాటు కల్పించాలి. కొత్త విద్యా విధానంలో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుంది. వారి మనో వికాసం మరింత వృద్ధి చెంది.. నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. పిల్లలు తమకు నచ్చిన కోర్సు చదువుకోవచ్చు.
‘పిల్లల్లో నిశిత పరిశీలన, ఆలోచనా విధానం.. యువతలో సృజనాత్మకత పెరిగే విధంగా నూతన విద్యా విధానం ఉంది. రాష్ట్రాలన్నీ కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలి. ఒకే దేశం – ఒకే విద్యా విధానం ఉండాలి. కొత్త విద్యా విధానంపై ఎవ్వరికీ అపోహలు అవసరం లేదు. భవిష్యత్ లక్ష్యాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ విధానం లక్ష్యం’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు’.