విశాఖపట్నంలో నిర్వహించిన డీజీ 100ఎక్స్ ఏపీ (Digii100x Andhra Pradesh) సదస్సులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ నిర్మాణమే తమ లక్ష్యమని, నైపుణ్యం కలిగిన మానవ వనరులే భవిష్యత్ పోటీ ప్రపంచంలో దేశం, రాష్ట్రాలను ముందంజలో నిలబెడతాయని అన్నారు. సుసంపన్న భవిష్యత్తు కోసం మానవ వనరులపై పెట్టుబడులు పెట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ప్రపంచం వేగంగా మారుతోందని, కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక సాంకేతికతల ప్రభావంతో ఉద్యోగాల స్వరూపం మారిపోతోందని లోకేష్ తెలిపారు. భూమి, సహజ వనరులు లేదా మూలధనం కంటే ప్రతిభే ఒక రాష్ట్రానికి నిజమైన బలమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో దశాబ్దాలుగా దేశానికి, ప్రపంచానికి అత్యుత్తమ మానవ వనరులను అందిస్తోందని గుర్తు చేశారు. సిలికాన్ వ్యాలీ నుంచి సింగపూర్ వరకు, లండన్ నుంచి దుబాయ్ వరకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు నిపుణులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
విద్యాశాఖ బాధ్యతలను తాను ప్రత్యేకంగా కోరుకుని తీసుకున్నానని లోకేష్ వెల్లడించారు. విద్య అనేది కేవలం డిగ్రీలు అందించే వ్యవస్థ మాత్రమే కాదని, తదుపరి తరం నాయకులను తయారు చేసే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం విద్య ద్వారానే లభిస్తుందని అన్నారు.
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు. మరో రెండు వారాల్లో స్కిల్ పోర్టల్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులను నిన్నటి ఉద్యోగాల కోసం కాకుండా, రేపటి అవకాశాల కోసం సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏఐ, ఎలక్ట్రానిక్స్ తయారీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని వివరించారు.
ఏఐ ఉద్యోగాలను తగ్గించదని, కొత్త అవకాశాలను సృష్టిస్తుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ప్రతి పారిశ్రామిక విప్లవం మరిన్ని ఉద్యోగాలకు దారితీసినట్లే, ఏఐ కూడా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు. ఏఐ ఆధారిత విద్య, పరిశోధన, పాలన, ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బ్రాండ్ సీబీఎన్, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీ ప్రత్యేకతలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. గూగుల్ భారతదేశంలోనే అతిపెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్లో పెట్టేందుకు ముందుకు వచ్చిందని, ఆర్సెలార్ మిట్టల్, ఫైటర్ జెట్ తయారీ వంటి కీలక ప్రాజెక్టులు కూడా రాష్ట్రంలోకి వచ్చాయని వెల్లడించారు.
దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని లోకేష్ తెలిపారు. గాజు తయారీ, డ్రోన్లు, సిమెంట్, ఉక్కు, ఆటోమొబైల్, ద్విచక్ర వాహనాలు, బయోగ్యాస్ వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ కూడా రాష్ట్రంలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని వెల్లడించారు.
యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఫిషరీస్, ఆక్వాకల్చర్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఏరోస్పేస్, డేటా సెంటర్లు, ఆటోమోటివ్ రంగాల్లో ప్రత్యేక క్లస్టర్ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. విద్య, ఆర్థికాభివృద్ధి పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, ఈ రెండింటిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
విద్యార్థులు ఓటమికి భయపడవద్దని లోకేష్ సూచించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఓడిపోయినా, దానిని పాఠంగా తీసుకుని కష్టపడి పనిచేసి తిరిగి విజయం సాధించానని గుర్తు చేశారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, సూచనలను ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతిస్తుందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
