ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ చదువుతున్న సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. ఆ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కి గాయాలు అయ్యాయి. కాళ్లకు, చేతులకు గాయాలు కావడంతో పవన్ కళ్యాణ్ హుటా హుటిన సింగపూర్కి వెళ్లిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయమై మంత్రి నారా లోకేష్ స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా ఆయన స్పందిస్తూ… సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. ఆ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య కుమారుడు మార్క్ శంకర్కి గాయాలు కావడం విచారకరం. మార్క్ శంకర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
పలువురు తెలుగు దేశం ప్రముఖులతో పాటు, జనసేన పార్టీ నాయకులు సైతం పవన్ కళ్యాణ్తో డైరెక్ట్గా మాట్లాడి లేదా కొందరు పార్టీ నాయకులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు మొదలు పెట్టిన కారణంగా ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అగ్ని ప్రమాదంకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.