మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కల్తీ మద్యం కేసుపై జగన్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా ప్రతిస్పందించారు. “కల్తీ మద్యం పట్టుకున్నది మా ప్రభుత్వం. నిందితుల్లో టీడీపీ నేతలు ఉన్నా, వారిని అరెస్ట్ చేయించాం. అంతేకాక, మా పార్టీ అధ్యక్షుడు వెంటనే వారిని సస్పెండ్ చేశారు,” అని లోకేష్ స్పష్టం చేశారు.
అయితే, జగన్ పాలనలో కల్తీ మద్యం ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. “మీ జమానాలో జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారిని మీరు సహజ మరణాలుగా చూపించారు. మీ మంత్రి జోగి రమేష్ ‘పోతే పోయారు… ఇంకా ఏడుస్తారేంటి?’ అన్న అహంకార వ్యాఖ్యను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారు,” అని లోకేష్ అన్నారు.
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును గుర్తుచేసిన లోకేష్, “ఆ కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మీద ఇప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు. సస్పెండ్ చేయడం బదులు ఆయనను ఇంటికి పిలిపించి సత్కరించారు,” అని విమర్శించారు.
లోకేష్ మరోసారి జగన్ను ఉద్దేశించి, “ప్రజల ప్రాణాలు తీసిన జే బ్రాండ్స్ లాంటి కల్తీ మద్యం వ్యాపారాలకు మీరు వత్తాసు పలికారు. ఇప్పుడు మీరు ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. ప్రజలు మిమ్మల్ని క్షమించరని గుర్తుంచుకోండి,” అన్నారు.
#LiquorScamByJagan
