విశాఖపట్నం: చారిత్రక వారసత్వం కలిగిన Andhra Universityకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అధికారులకు ఆదేశించారు. విశాఖలో యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కీలక సూచనలు చేశారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ సహా ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఆంధ్ర యూనివర్సిటీకి గొప్ప చరిత్ర ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాలు యూనివర్సిటీని ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దే వేదిక కావాలని అన్నారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వరకు జరిగే కార్యక్రమాల్లో పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. యూనివర్సిటీ చరిత్ర, విజయాలను ప్రతిబింబించేలా ఉత్సవాలను ప్రణాళిక చేయాలని అధికారులను ఆదేశించారు.
కమిటీల మధ్య సమన్వయం బలోపేతం చేయాలని, మీడియా ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రస్తుత విద్యార్థులతో కళలు, సంగీతం, సాహిత్యం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని, వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు, విద్యార్థులను శతాబ్ది వేడుకల్లో భాగస్వాములను చేయాలని, ప్రముఖులతో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించాలని సూచించారు. యూనివర్సిటీ వందేళ్ల విజన్కు అనుగుణంగా స్పష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు.
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టబోయే అభివృద్ధి పనులు, ఏప్రిల్ 26న నిర్వహించనున్న స్థాపన దినోత్సవ అజెండాను వీసీ వివరించారు. అనుబంధ కళాశాలలను కూడా ఉత్సవాల్లో భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు శతాబ్ది ఉత్సవాలను విశాఖపట్నం, ఉత్తరాంధ్రకు గుర్తింపు తీసుకువచ్చేలా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు.
