నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి వారి కుమారుడు దేవాన్ష్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామి రావు ఆశీస్సులు పొందారు.
నారా దేవాన్ష్ పుట్టినరోజు పురస్కరించుకుని తిరుమల శ్రీవారి సేవలో నారా కుటుంబం పాల్గొన్నది. వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ఇతర కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు మహాద్వారం నుంచి గౌరవ మర్యాదలతో స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సీఎం నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్ భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్నప్రసాద్ వితరణకు అయ్యే 44 లక్షల రూపాయలను చంద్రబాబు నాయుడి కుటుంబం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళం ఇచ్చారు.
ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకుని అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి మిగతా టీటీడీ బోర్డు సభ్యులు టీడీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.