హైదరాబాద్లో జరిగిన ‘కూలీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింగ్ నాగార్జున ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమాలో సైమన్ పాత్ర తనకు చాలా ఇష్టమని, అది నిజంగా హీరోలాగే ఉంటుందని చెప్పారు.
నాగార్జున మాట్లాడుతూ, “ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొత్త ప్రయోగాలు చేయాలి. నా కెరీర్లో చాలా రిస్క్లు తీసుకున్నాను. కొన్నిసార్లు ఫెయిల్ అయినా, మంచి విజయాలు కూడా సాధించాను” అన్నారు.
లోకేశ్ కనగరాజ్తో తన అనుభవం గురించి మాట్లాడుతూ, “ఖైదీ సినిమా చూసిన తర్వాత ఆయనతో తప్పనిసరిగా పని చేయాలని అనుకున్నాను. ‘కూలీ’ కథ చెప్పినప్పుడు సైమన్ పాత్ర నన్ను చాలా ఆకట్టుకుంది. నేను కూడా కొన్ని మార్పులు సూచించాను, లోకేశ్ వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దారు” అని చెప్పారు.
సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ, “సెట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండేది. థాయ్లాండ్లో 17 రోజులు రాత్రిళ్లే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాం. రజినీ సార్ ఎంతో గొప్ప మనసు కలవారు. చివరి రోజు మొత్తం టీమ్కి బహుమతులు ఇచ్చారు” అని తెలిపారు.
నాగార్జున మాట్లాడుతూ, “సన్ పిక్చర్స్ ఇచ్చిన బడ్జెట్లోనే సినిమా పూర్తి అయింది. చాలా సీన్స్ సింగిల్ టేక్లోనే పూర్తయ్యాయి. నా పాత్ర నెగటివ్ అయినా నాకు ఈ అనుభవం చాలా పాజిటివ్గా అనిపించింది” అని అన్నారు.
‘కూలీ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
