జనసేన పార్టీ కార్యకర్తలే మా బలం, వారి సంతోషమే మా సంతోషమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరంలో జరిగిన ఉమ్మడి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
త్వరలో ఉత్తరాంధ్రలో పార్టీ కార్యాలయం ప్రారంభిస్తామని వెల్లడించిన ఆయన, జనసేన, బీజేపీ, తెలుగు దేశం కార్యకర్తలు స్నేహపూర్వకంగా కలిసి పని చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగితే వాటిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సోషల్ ఆడిట్ చేస్తామని స్పష్టం చేశారు.
మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, నాయకులు మరియు కార్యకర్తలు తరచూ కలుసుకుని ప్రజా సమస్యలపై చర్చించాలి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. పనులను విజయవంతంగా పూర్తి చేసినవారి అనుభవాలను ఇతరులు నేర్చుకోవాలని, పరస్పరం సహకారం ఉంటే అనేక సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, మహిళా రీజినల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ, పీ.ఓ.సీ.లు, స్థానిక నాయకులు, మండల అధ్యక్షులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

