Monsoon: ఎండలతో, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. ఆలస్యం అవుతుందనుకున్న నైరుతి రుతుపవనాలు (Monsoon) మొత్తానికి దేశంలోకి ప్రవేశించాయి. రుతుపవనాలు గురువారంనాడు కేరళ (Kerala) తీరాన్ని తాకినట్టు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రస్తుతం అక్కడి వాతావరణం చల్లబడింది. అయితే.. ఐఎండీ అంచనాలను దాటి వారంరోజులు ఆలస్యంగా దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ప్రస్తుతం ఇవి లక్షద్వీప్, కేరళ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.
వీటి ప్రభావంతో ఇప్పటికే కేరళలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల్లో ఇవి కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరిస్తాయని తెలిపింది. ఈప్రభావంతో ఒక వారం మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ ఉదయం రాష్ట్రంలో అక్కడక్కడా వాతావరణం చల్లబడినా మధ్యాహ్నానికి మళ్లీ ఎండలతో ఉక్కపోతలతో వాతావరణం వేడెక్కింది. వాస్తవానికి రుతుపవనాలు కేరళకు 1వ తేదీనే రావాల్సి ఉన్నా వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో ఆలస్యమయ్యాయి. భారత వాతావరణ శాఖ ప్రకటనతో రైతుల్లో, ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.