వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో స్వయంగా పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అర్ధరాత్రి వరకు టన్నెల్లోనే ఉండి లైనింగ్, బెంచింగ్ పనుల పురోగతిని సమీక్షించారు.
మంత్రి నిమ్మల టన్నెల్స్లో దాదాపు 19 కిలోమీటర్ల మేర ప్రయాణించి, ఐదు గ్యాంట్రీల ద్వారా జరుగుతున్న పనులను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్-2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన టీబీఎం మెషిన్ దగ్గరకు వెళ్లి పరిస్థితిని నేరుగా పరిశీలించారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం టీబీఎం మెషిన్ తొలగింపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. “టీబీఎం తొలగించకపోతే టన్నెల్ నుంచి చుక్క నీరు కూడా బయటికి రాదు. ఇంకా రూ.3 వేల కోట్ల పనులు మిగిలి ఉన్నప్పటికీ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని చెప్పి ప్రకాశం జిల్లా రైతులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది” అని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు.
టన్నెల్లో కొన్ని ప్రాంతాల్లో కొండరాళ్లు ఊడి పడుతున్నాయని, సాఫ్ట్ రాక్ ప్రాంతాల్లో ప్రమాద అవకాశాలు ఉన్నాయని గుర్తించిన మంత్రి, పనులు అత్యంత జాగ్రత్తగా కొనసాగించాలని అధికారులకు, ఏజెన్సీ ప్రతినిధులకు సూచించారు. కార్మికుల భద్రత విషయంలో రాజీపడొద్దని స్పష్టం చేశారు.
పనుల సమీక్ష అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు టన్నెల్-2లోనే అధికారులు, కార్మికులతో కలిసి భోజనం చేశారు. మంత్రి స్వయంగా టన్నెల్లోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించడం, కార్మికులతో మాట్లాడడం అక్కడి సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపింది.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రకాశం జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం నిలిచిపోయిన కీలక పనులను వేగంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
