విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి యువగళం హామీని నిలబెట్టుకున్నారు. కర్నూలు పట్టణం అశోక్ నగర్లోని మున్సిపల్ పంప్ హౌస్ ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న గూడెం కొట్టాలు వాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
సుమారు 150 మంది నిరుపేదలు ఈ ప్రాంతంలో పూరి గుడిసెలు వేసుకుని నాలుగు దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. తమకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులను కోరినా ఫలితం లేకపోయింది. యువగళం పాదయాత్రలో కర్నూలుకు వచ్చిన నారా లోకేష్ను, అప్పటి టీడీపీ ఇంఛార్జ్ టీజీ భరత్తో కలిసి స్థానికులు కలసి తమ సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన లోకేష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీని అమలు చేస్తూ 2025 జనవరిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 30 ప్రకారం కోట్ల విలువ చేసే సుమారు ఎకరా స్థలాన్ని నిరుపేదలకు కేటాయించింది. మంగళవారం మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా 150 మంది కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తమ 40 ఏళ్ల కల నెరవేర్చినందుకు గూడెం కొట్టాలు వాసులు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు.
