ఎమ్మెల్యే కోటంరెడ్డికి జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదని.. అదొక మ్యాన్ టాపింగ్ అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘కోటంరెడ్డి టీడీపీ ఉచ్చులో చిక్కుకుని వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్టు ఆడియో క్లిప్ లో ఉంది. దానికేం సమాధానం చెప్తారు. ఆయనకూ తెలుసు.. అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ అని. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే.. కేంద్రానికి ఫిర్యాదు చేయకపోవడం.. కోర్టులను ఆశ్రయించకపోవడం ఏంటి..? ’
‘కోటంరెడ్డి ఉన్న స్థితి జగన్ భిక్ష. ఇప్పుడు వేరొకరికి వీరవిధేయుడయ్యారు. రూరల్ నియోజకవర్గంలో చిన్నచిన్న పొరపాట్లు జరిగినా జగన్ కోటంరెడ్డిపై నమ్మకం ఉంచబట్టే జగన్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. కోటంరెడ్డి నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యం. కోటంరెడ్డి వెళ్లిపోతే పార్టీకేం నష్టం లేదు. మరెంతోమంది విధేయులు పార్టీలోకి వస్తారు. సజ్జలపై కోటంరెడ్డి విమర్శలు సరికాదు.. ఈ అంశంతో ఆయనకేం సంబంధం లేదు’ అని అన్నారు.