ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్ ఎంటర్టైనర్లో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 14, 2026న థియేటర్లలో విడుదల కానున్న ‘అనగనగా ఒక రాజు’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్తో ఆ ఆసక్తి మరింత పెరిగింది.
సినిమా విడుదలకు సమీపిస్తున్న వేళ కథానాయిక మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడుతూ తన పాత్ర, సినిమా ప్రత్యేకతలు, కెరీర్పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వరుసగా సంక్రాంతికి సినిమాలు రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరిచిపోలేని విజయాన్ని అందుకున్నానని, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాననే నమ్మకం ఉందన్నారు.
ఈ చిత్రంలో తాను పోషిస్తున్న పాత్ర పేరు చారులత అని, సంపన్న కుటుంబంలో గారాల పట్టిగా పెరిగిన యువతిగా కనిపిస్తానని చెప్పారు. అమాయకత్వం, సున్నితమైన మనసు, క్యూట్ బిహేవియర్తో కూడిన పూర్తి కామెడీ పాత్రలో తాను కనిపించనున్నానని తెలిపారు. నిజ జీవితానికి పూర్తిగా భిన్నమైన ఈ పాత్ర కోసం దర్శకుడు ఇచ్చిన సూచనలను బాగా అర్థం చేసుకుని హోంవర్క్ చేశానని చెప్పారు. తాను సాధారణంగా ప్రాక్టికల్గా ఉంటే, చారులత పాత్ర మాత్రం పూర్తిగా ఎమోషనల్, సెన్సిటివ్గా ఉంటుందని వివరించారు.
నవీన్ పొలిశెట్టితో కలిసి పని చేయడం ఒక సినిమా స్కూల్లో నేర్చుకున్నట్టే అనిపించిందని మీనాక్షి చెప్పారు. ఆయన కామెడీ టైమింగ్ ప్రత్యేకమని, ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్ను కచ్చితమైన టైమింగ్తో పలకడం తనకు పెద్ద ఛాలెంజ్గా మారిందని వెల్లడించారు. ఇప్పటివరకు తాను చేసిన పాత్రల్లో ఇదే అత్యంత ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు. కొత్త తరహా కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సినిమా తన కెరీర్కు చాలా ఉపయోగపడుతుందని మీనాక్షి అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయి కామెడీ పాత్ర చేయడం ఇదే తొలిసారి అని, దీని వల్ల నటిగా మరింత ఓపెన్ అయ్యానన్నారు. ‘లక్కీ భాస్కర్’లోని సుమతి పాత్రకు, ‘అనగనగా ఒక రాజు’లోని చారులత పాత్రకు ఏ మాత్రం పోలిక లేదని, ప్రతి పాత్రకు తాను కొత్తగా మారుతానని చెప్పారు.
సినిమాలో మాస్ డ్యాన్స్ నెంబర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. ‘భీమవరం బాల్మా’, ‘రాజు గారి పెళ్లిరో’ లాంటి పాటలు క్యూట్ మాస్ ఫీల్తో ఉంటాయని, సాధారణంగా డ్యాన్స్ విషయంలో కొంచెం సంకోచం ఉన్నా, ఈ సినిమాలో చాలా సరదాగా షూటింగ్ చేశామని చెప్పారు. ప్రతి పాట ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
గోదావరి ప్రాంతంలో షూటింగ్ అనుభూతి ఎంతో మధురంగా ఉందని మీనాక్షి గుర్తు చేసుకున్నారు. అక్కడి ప్రజల ఆతిథ్యం, వంటకాలు, ఆలయాలు తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. సినిమా పట్ల గోదావరి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.
ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని, అలాంటి విభిన్న పాత్రలు తనకు రావడం సంతోషంగా ఉందని మీనాక్షి అన్నారు. తల్లి, ఐపీఎస్ అధికారి, ఇప్పుడు పూర్తిస్థాయి కామెడీ పాత్ర ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో కోణంలో కనిపిస్తున్నానని చెప్పారు. కథే హీరో అన్న నమ్మకంతోనే కథల ఎంపిక చేస్తానని, పాత్ర తన కెరీర్కు ఎంత ఉపయోగపడుతుందో చూసే నిర్ణయం తీసుకుంటానని వివరించారు.
సితార సంస్థలో ఇది తనకు మూడో సినిమా అని, ఆ బ్యానర్ను కుటుంబంలా భావిస్తానని చెప్పారు. యువ ప్రతిభను ప్రోత్సహించే సితార సంస్థలో వరుసగా అవకాశాలు రావడం అదృష్టమని, విభిన్న సినిమాలు చేయగలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు మారి గురించి మాట్లాడుతూ, నూతన దర్శకుడైనా పూర్తి క్లారిటీతో, ఓపికతో పనిచేసే ప్రతిభావంతుడని ప్రశంసించారు.
సినీ ప్రయాణం అనేది ముగింపు లేని పరుగు పందెంలాంటిదని, ఎప్పుడూ కొత్తగా రుజువు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని మీనాక్షి స్పష్టం చేశారు. ప్రస్తుతం నాగ చైతన్యతో ‘వృషకర్మ’ సినిమా చేస్తున్నానని, మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్టుల ప్రకటనలు త్వరలో వస్తాయని తెలిపారు. మొత్తంగా ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’తో ప్రేక్షకులకు నవ్వుల విందు ఖాయమని మీనాక్షి చౌదరి ధీమాగా చెప్పారు.
