టాలీవుడ్ కొత్త టాలెంట్కి ఎప్పుడూ స్వాగతం పలుకుతూ ఉంటుంది. తాజాగా “ఏ స్టార్ ఈజ్ బార్న్” అనే టైటిల్ మార్చి, “మ్యానిప్యూలేటర్” పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను దర్శకుడు బి.గోపాల్ ఆవిష్కరించారు.
వీజే సాగర్ కథ, మాటలు, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సి.రవి సాగర్, వీజే సాగర్ నిర్మిస్తున్నారు. సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్, ప్రియా పాల్, సోఫియా ఖాన్, ఊహ రెడ్డి సహా 43 మంది కొత్త నటీనటులు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
ఈ సినిమా క్యారెక్టర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్తో కల్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ సంగీతం అందించగా, తనికెళ్ళ శంకర్, వరికుప్పల యాదగిరి, విశ్వనాథ్ సాహిత్యం రాశారు. మొత్తం ఐదు విభిన్నమైన పాటలు ఈ సినిమాలో ఉంటాయి.
దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ, “‘మ్యానిప్యూలేటర్’ టైటిల్ యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా కూడా ఆ వరుసలో ఉంటుంది” అని తెలిపారు.
త్వరలో గ్రాండ్ ఆడియో లాంచ్ తర్వాత “మ్యానిప్యూలేటర్” విడుదలకు సిద్ధమవుతోంది. నేటి యువత జీవనశైలిని కళ్ళకు కట్టినట్లు చూపించడమే ఈ చిత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
