కోర్టు కేసుల కోసం ప్రభుత్వం వందల కోట్లు వృధా చేస్తోందా.? కేవలం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పర్యావరణ అనుమతుల వివాదానికి సంబంధించి ప్రభుత్వం తరఫున వాదనల కోసమే వంద కోట్ల పైన ఖర్చయ్యిందా.? ‘ఇంతమంది లాయర్లు వాదించాల్సిన అవసరమేంటి.? ఎంత ప్రజాధనం దుర్వినియోగమవుతోంది.?’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేయడం అంతటా చర్చనీయాంశమయ్యింది.
కేవలం పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల వివాదం మీదనే 100 కోట్లు ప్రభుత్వం న్యాయవాదుల కోసం ఖర్చు చేస్తోన్నమాటే నిజమైతే, వందలు కాదు.. వేల కేసులు వివిధ కోర్టుల్లో విచారణ దశలో వున్నాయ్. వాటి కోసం ప్రభుత్వం ఇంకెంతలా ఖర్చు చేస్తోందిట.? ఈ ప్రశ్న సహజంగానే, రాష్ట్ర ప్రజానీకంలో అలజడిని రేకెత్తిస్తోంది.
ప్రత్యేకించి, రాజధాని అమరావతి విషయమై వైఎస్ జగన్ సర్కారు, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో తమ వాదనల్ని బలంగా వినిపించేందుకు ప్రముఖ న్యాయవాదుల్ని నియమిస్తున్న సంగతి తెలిసిందే.
‘అమరావతిలో ఉద్యమిస్తున్నది పేద రైతులు కాదు.. కోట్లు వెచ్చించి లాయర్లను పెట్టుకుంటున్నారు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు..’ అని గతంలో వైసీపీ ఆరోపణలు చేయడం చూశాం. పలువురు మంత్రులు కూడా ఇవే ఆరోపణలు చేశారు. మరి, ఆ అమరావతి రైతుల తరఫున వాదిస్తోన్న న్యాయవాదులకు ధీటుగా ప్రభుత్వం కూడా కొందరు ‘ఖరీదైన న్యాయవాదుల్ని’ రంగంలోకి దించింది కదా.? దాని మాటేమిటి.?
హైకోర్టు మొట్టికాయలేసినా, సుప్రీంకోర్టు తలుపు తట్టి.. అక్కడా మొట్టికాయలేయించుకోవడం వైసీపీ సర్కారుకి కొత్తేమీ కాదు. కేసులో నెగ్గలేమని తెలిసీ, న్యాయస్థానాల్ని ప్రభుత్వం ఆశ్రయిస్తున్నది, ప్రజల సొమ్ముని వృధాగా ఖర్చు చేయడం కోసమేనన్న విపక్షాల విమర్శల్లోనూ వాస్తవం లేకపోలేదనిపించడం మామూలే.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం, చంద్రబాబుపైనా, ఆయన తనయుడు లోకేష్ మీదా కేసుల వ్యవహారాలు.. చెప్పుకుంటూ పోతే, మూడొందల కేసులు.. ముప్ఫయ్ మూడు వేల ఆరోపణలు.. అన్నట్లు తయారైంది పరిస్థితి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే, ఎన్ని వందల కోట్లు.. ఎన్ని వేల కోట్లు కోర్టు ఖర్చుల కోసం అధికారపక్షం వృధా చేస్తోందబ్బా.? అన్న డౌటానుమానం ప్రజల్లో కలగడం సహజమే కదా.!
‘ఎంత సొమ్ము వృధా చేస్తున్నారో లెక్కలు తేల్చాలని ఆదేశాలిస్తాం..’ అని సుప్రీంకోర్టు హెచ్చరించే స్థాయికి వచ్చిందంటే, పరిస్థితి తీవ్రంగా వుందన్నమాట. హెచ్చరించడం కాదు, ఆ ఆదేశాలు ఏవో ఇచ్చేస్తే, ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తోందో ప్రజలకీ ఓ ఐడియా వస్తుంది.
