కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్హౌస్లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని గెస్ట్ హౌస్లో చంద్రబాబు ఏం చేస్తున్నారు.? అని ఆరాలు తీసినప్పుడు, ‘తాడేపల్లి ప్యాలెస్’లో జగన్ ఏం చేస్తున్నారు.. అని ఆరా తీయడంలో తప్పేమీ లేదు కదా.!
ప్రజా జీవితంలోకి వస్తే, ఎవర్నయినా ఏమన్నా అంటాం.. అని రాజకీయ నాయకులు చెబుతుంటారు. అలా చెప్పేవాళ్ళని కూడా జనం ఏదో ఒకటి అంటుంటారు కదా.! అలాగే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కూడా అంటున్నారు, నానా రకాలుగా అనుకుంటున్నారు.!
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అధికార పీఠమెక్కేముందు.. వైఎస్ జగన్, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో సొంత ఇల్లు కట్టుకున్నారు. ఇదే రాజధాని, అందుకే ఇక్కడే ఇల్లు కట్టుకున్నా.. అని కూడా చెప్పారు జగన్. కానీ, అధికారంలోకి వచ్చాక, అమరావతిని ‘కమ్మరావతి’ అని పేర్కొంటూ, ఆ అమరావతి మీద నానా రకాల దుష్ప్రచారమూ చేశారు.
ఇప్పుడేమో అధికారం ఊడింది.! ఇంతకీ, అమరావతిలోని తాడేపల్లిలోగల వైఎస్ జగన్ ఇంట్లో ఏముంది.? ఆ ఇంటికి, అధికారంలో వుండగా, ప్రజాధనంతో దిద్దిన మెరుగులేంటి.? ఇంటి చుట్టూ దాదాపు ముప్ఫయ్ అడుగుల యెత్తున ఆ రక్షణ కవచాలేంటి.? ఇలా ప్రజల మెదళ్ళలో బోల్డన్ని ప్రశ్నలు.
నిజానికి, వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ అనేది ప్రైవేటు ఆస్తి. అందులోకి తొంగి చూడాలని అనుకోవడం ఎవరికీ తగదు. కాకపోతే, పైన చెప్పుకున్నట్లు.. ‘అందరి జీవితాల్లోకీ వైసీపీ తొంగి చూసిన దరిమిలా, తాడేపల్లి కొంపలోకి కూడా తొంగి చూడాలి కదా..’ అన్నది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న.
ఆ ప్యాలెస్ చుట్టూ సామాన్యులు తిరగకుండా, రోడ్లను బ్లాక్ చేసి పడేశారు గడచిన ఐదేళ్ళుగా. ఇప్పుడు ఆ రోడ్లు సామాన్యుల రోజువారీ అవసరాల నిమిత్తం తెరచుకున్నాయి కూటమి ప్రభుత్వం పుణ్యమా అని.
అలా అటు వెళ్ళే అవకాశం దక్కిన జనం, అక్కడి ఆ ప్యాలెస్ నిర్మాణాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ‘అదిగో, ఆ గేటు.. మనం కట్టిన పన్నులతో నిర్మించుకున్నదే.. ఇదిగో, ఈ రక్షణ కవచానికీ, ప్రజాధనాన్నే వెచ్చించారు..’ అని జనం చర్చించుకుంటున్నారు.
ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో, ఆ ముఖ్యమంత్రి రక్షణ కోసం ప్రభుత్వం ఖర్చు చేసిందేమో.! ఇప్పుడాయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నేత కూడా కాదు.! మరి, ఆ ఖర్చుల్ని వెనక్కి తీసుకోవాలి కదా.? అని జనం మాట్లాడుకుంటోంటే, దాన్ని నిలువరించగలమా.?
‘తాడేపల్లి జగన్ ప్యాలెస్ రహస్యం బట్టబయలవ్వాలి.. అక్కడ నేల మాళిగలే వున్నాయో.. ఇంకేమన్నా వున్నాయో.. వందల కోట్లు కాదు, వేల కోట్లు.. లక్షల కోట్లు మగ్గుతున్నాయేమో..’ అన్న చర్చ జనంలో జరిగే పరిస్థితి ఎందుకొచ్చింది. ఈ ప్రశ్నలకు సమాధానం, చంద్రబాబు ప్రభుత్వం చెబుతుందా.? వేచి చూడాలిక.