తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు హాజరై తమ సమస్యలను నేరుగా మంత్రికి తెలియజేశారు. వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వినతులను స్వీకరించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన పత్తి శివకుమార్ తమకు వారసత్వంగా వచ్చిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని, దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. తిరుమలలో అంగప్రదక్షణ భక్తులకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి, ఆఫ్లైన్ ద్వారా టోకెన్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ‘తిరుమల అంగప్రదక్షణ భక్తబృందం’ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కచ్చరావేడు గ్రామంలో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని బి. శ్రీనివాసులు కోరారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో జీవనోపాధి కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న 150 ఎస్టీ ఎరుకుల కుటుంబాలకు ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని శ్రీ వేంకటేశ్వర ఎస్టీ ఎరుకల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో సొసైటీ విధానంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీసర్లకు ఇతర ఉద్యోగుల మాదిరిగానే వైద్య సదుపాయం, శ్రీవారి దర్శనం కల్పించాలని సిబ్బంది కోరారు.
గత వైసీపీ ప్రభుత్వ కాలంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో తొలగింపునకు గురైన 160 మంది కాంట్రాక్ట్, పార్ట్టైం సూపర్వైజర్లకు తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. అలాగే అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బలిజపల్లికి చెందిన కె. పార్వతి తమకు వారసత్వంగా వచ్చిన రెండెకరాల భూమిని ఆన్లైన్లో నమోదు చేసి హక్కులు కల్పించాలని కోరారు.
అన్ని వినతులను శ్రద్ధగా విన్న మంత్రి నారా లోకేష్, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్ అనంతరం హాజరైన ప్రజలు, కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు.
