తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుడిపై, తిరుమలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయాలు చేయడం తగదని మండిపడ్డారు.
మండలిలో చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హెరిటేజ్ డెయిరీపై ఆరోపణలు చేయగా, మంత్రి లోకేష్ వాటిని తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు చేయాలంటే ఆధారాలతో సభలో మాట్లాడాలని, ఊహాగానాలతో దూషణలు చేయడం సరైంది కాదని అన్నారు. దేవుడంటే తమ కుటుంబానికి అపారమైన గౌరవం ఉందని, గత పదేళ్లుగా తన కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు.
అలాంటి తమ కుటుంబంపై ఆరోపణలు చేయడం బాధాకరమని లోకేష్ అన్నారు. తిరుమలలో తమకు ప్రత్యేక హక్కులు ఉన్నప్పటికీ ఎప్పుడూ ప్రధాన ద్వారం ద్వారా వెళ్లలేదని, సాధారణ భక్తుల్లాగే క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం చేసుకున్నామని చెప్పారు. దేవుడిపై తమ కుటుంబం ఎప్పుడూ గౌరవంతోనే వ్యవహరించిందని స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందనే విషయాన్ని సీబీఐ ఛార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నదని లోకేష్ చెప్పారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని అంగీకరించారని గుర్తుచేశారు. అయినా ఇప్పుడు వైసీపీ నాయకులు కల్తీ జరగలేదని చెప్పడం ఆశ్చర్యకరమని విమర్శించారు.
నెయ్యి మార్కెట్ ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో రూ.300కి నెయ్యి సరఫరా చేయడం ఎలా సాధ్యమవుతుందో సాధారణ బుద్ధితో ఆలోచించాలన్నారు. మార్కెట్ ధరలు గూగుల్లో చూసినా తెలుస్తాయని చెప్పారు. కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
తిరుమల విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని లోకేష్ సూచించారు. తమ కుటుంబంపై విమర్శలు చేయడమే కాకుండా దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదన్నారు. అలాగే వైసీపీ అధినేత జగన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్పై కనీసం సంతకం కూడా పెట్టలేదని ప్రశ్నించారు. కల్తీ జరగలేదని చెప్పడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని, దేవుడు ఇలాంటి పనులను క్షమించడని మండిపడ్డారు.
