అమరావతి: అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. శాసనమండలిలో అంగన్వాడీల అంశంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేసిన నేపథ్యంలో మంత్రి లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు సభలో చర్చ వినకుండా వాకౌట్ చేయడం సరికాదన్నారు. ఈ రోజు వెనుక తలుపు నుంచి వాకౌట్ చేశారని, మొన్న ముందు తలుపు నుంచి వాకౌట్ చేశారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని ప్రతిపక్ష నేత బొత్స వ్యాఖ్యానించారని గుర్తు చేస్తూ, అదే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వస్తోందని చెప్పారు. అమరావతి పనులు ఎందుకు నిలిపివేశారని, అన్న క్యాంటీన్లను ఎందుకు మూసివేశారని కూడా ప్రశ్నించారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రజలతో కలిసి పనిచేసే ప్రజా ప్రభుత్వం అని మంత్రి లోకేష్ అన్నారు. గతంలోలా పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితి లేదని, ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. విద్యాశాఖలో కూడా వివిధ సంఘాలతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోలతో ప్రభుత్వం చర్చించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల అంగన్వాడీలు నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వం సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఆ సమయంలో వారికి అన్న క్యాంటీన్లలో భోజనం అందించామని, తాగునీరు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. అవసరమైతే అంబులెన్స్లు కూడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
సాయంత్రం తర్వాత అనుమతి లేకుండా అక్కడే ఉండటంతో వారి భద్రత దృష్ట్యా ఆందోళన కలిగిందని మంత్రి చెప్పారు. అందుకే మహిళా కానిస్టేబుళ్ల సహాయంతో వారిని అక్కడి నుంచి వెళ్లేలా బతిమిలాడి పంపించామని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎవరినీ అరెస్ట్ చేయలేదని, ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు.
అంగన్వాడీ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం గంభీరంగా పరిశీలిస్తోందని, వేతనాల పెంపు అంశం కూడా పరిశీలనలో ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. ముఖ్యమంత్రి కూడా దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటారని అంగన్వాడీలకు తెలియజేస్తున్నానని చెప్పారు. ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపైనా ప్రభుత్వం చర్చించి పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.
