అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మరో భారీ ఔషధ తయారీ పరిశ్రమకు నాంది పడింది. అచ్యుతాపురం–రాంబిల్లి మండలాల పరిధిలోని సీతపాలెం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనిట్కు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
సీతపాలెం ఇండస్ట్రియల్ పార్క్కు చేరుకున్న మంత్రి లోకేష్కు కంపెనీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్కు భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియేట్స్ మరియు కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.2,300 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది.
ఈ యూనిట్ ఏర్పాటుతో సుమారు 1,750 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యేక ఔషధ మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో గుర్తింపు పొందిన బ్లూ జెట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 102.48 ఎకరాల భూమిని కేటాయించింది. పరిశ్రమ స్థాపనతో అనకాపల్లి జిల్లా పరిశ్రమల రంగంలో మరింత వేగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, బీయలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఏపీఆర్డీసీ ఛైర్మన్ పి. నాగేశ్వరరావు, బ్లూ జెట్ హెల్త్కేర్ సంస్థ ఛైర్మన్ అక్షయ్ బన్సారీలాల్ అరోరా, మేనేజింగ్ డైరెక్టర్ శివెన్ అరోరా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేణుబాబు, సహ వ్యవస్థాపకులు నరేష్ షా, కలెక్టర్ విజయ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీఐఐసీ మరియు వివిధ శాఖల అధికారులు, కంపెనీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు.
అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, అచ్యుతాపురం SEZలో బ్లూ జెట్ హెల్త్ కేర్ పెట్టుబడి రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి మరో పెద్ద ముందడుగుగా నిలవనుంది.
