శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి నారా లోకేష్ జడ్స్కాలర్ సీఈవో జే చౌదరిని కలిసి ఆంధ్రప్రదేశ్లో సైబర్ సెక్యూరిటీ అభివృద్ధికి అనుకూలమైన అవకాశాలను వివరించారు. క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో ప్రపంచవ్యాప్త పేరొందిన ఈ సంస్థను విశాఖపట్నంలో డెవలప్మెంట్ సెంటర్, ఆర్అండ్డీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. డేటా సిటీగా ఎదుగుతున్న విశాఖకు అనేక అంతర్జాతీయ క్లయింట్లు వస్తున్న నేపథ్యంలో, ఏఐ ఆధారిత క్లౌడ్ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని లోకేష్ వివరించారు.
జడ్స్కాలర్ సీఈవో జే చౌదరి మాట్లాడుతూ, బెంగుళూరులో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్, ఇన్నోవేషన్, కోర్ ప్లాట్ఫాం డెవలప్మెంట్ సెంటర్లు విజయవంతంగా నడుస్తున్నాయని గుర్తుచేశారు. భారతీయ గ్లోబల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, టెలికాం సంస్థలతో భాగస్వామ్యాలు పెరుగుతున్నాయని అన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను సురక్షితంగా చేసే లక్ష్యంతో ప్రముఖ బ్యాంకులు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలకు సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సంస్థ సహచర బృందంతో సమీక్షించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చౌదరి స్పష్టం చేశారు. విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు లభించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Lokesh Invites Zscaler to Set Up Development Centre in Visakhapatnam
