విశాఖపట్నంలో అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఫిన్టెక్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేదమంత్రాల మధ్య రిబ్బన్ కట్ చేసి, జ్యోతిప్రజ్వలన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మధురవాడ హిల్ నెం–2లోని మహతి ఫిన్టెక్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్లో వెయ్యి మందికి సీటింగ్ సౌకర్యం కల్పించారు. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ మొదటి దశ పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగనున్నాయి. AI, ML, క్లౌడ్ సొల్యూషన్స్, డిజిటల్ ఇంజినీరింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలపై ఈ సెంటర్ దృష్టి పెట్టనుంది.
తరువాత ఉద్యోగులతో మాట్లాడిన మంత్రి లోకేష్, “ఆంధ్రప్రదేశ్ గర్వించేట్టు పనిచేయాలి. యువతే భవిష్యత్తుకు మార్గదర్శకులు. కృషితో విజయాలు సాధించాలి” అని సూచించారు. గతేడాది జనవరిలో కాగ్నిజెంట్ అధినేత రవికుమార్ను కలిసిన తర్వాత ఏడాదిలోనే సంస్థను రాష్ట్రానికి తీసుకురావడం సంతోషకరమని తెలిపారు. విశాఖను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో ఎస్. రవికుమార్, గుమ్మడి సూర్య, తిరుమల నారాయణన్, గౌరవ్ హజ్రా, ఎంపీ భరత్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
