కూటమి ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న అనుబంధం, వారి కుటుంబాల మధ్య కూడా మరింత బలపడాలనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ గురువారం ఉండవల్లి నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కర్నూలు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో హాజరై ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఒక కుటుంబ సమావేశంలా మార్చారు. నేతల కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకుని సరదా సంభాషణలతో ఆహ్లాదకర వాతావరణంలో సమయాన్ని గడిపాయి. రాజకీయ జీవితం నుంచి కాస్త విరామం తీసుకుని అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం ఈ సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా లోకేష్ నేతల కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తూ వారి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ స్థిరపడ్డారు అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. 25 ఏళ్లకు అబ్బాయిలకు పెళ్లి చేయాలనే ఆలోచన ఉందని, తనకు మాత్రం 24 ఏళ్లకే పెళ్లయ్యిందని సరదాగా వ్యాఖ్యానించారు. తన కుమారుడు దేవాన్ష్కు కూడా ఇప్పటి నుంచే ఆ దిశగా అలవాటు చేస్తున్నానని నవ్వుతూ చెప్పారు. అలాగే నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి నేతలు తనకు అందించిన దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారమయ్యాయి, ఏవి పరిశీలనలో ఉన్నాయి, ఇంకా ఏవి పెండింగ్లో ఉన్నాయనే వివరాలతో కూడిన నివేదికను ఆయా నేతలకు అందజేశారు. సమావేశంలో మహిళలకు మంగళగిరి పట్టుచీరలు బహూకరించగా, విందు ముగిసిన తరువాత లోకేష్ గేటు వరకూ వెళ్లి అతిథులకు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు టీజీ భరత్ (కర్నూలు), పివి పార్థసారధి (ఆదోని), కేఈ శ్యాంబాబు (పత్తికొండ), బొగ్గుల దస్తగిరి (కోడుమూరు), బివి జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు), ఎమ్మెల్సీ బీటీ నాయుడు హాజరయ్యారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు (వినుకొండ), భాష్యం ప్రవీణ్ (పెదకూరపాడు), పత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), చదలవాడ అరవింద్ బాబు (నరసరావుపేట), కన్నా లక్ష్మీనారాయణ (సత్తెనపల్లి), యరపతినేని శ్రీనివాసరావు (గురజాల), జూలకంటి బ్రహ్మారెడ్డి (మాచర్ల), ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కూటమి నేతలు ఒకే వేదికపై కుటుంబాలతో కలుసుకోవడం పరస్పర అవగాహనను పెంచడమే కాకుండా, ప్రజాసేవలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది.


