అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శాసనమండలిలో సభ్యురాలు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ ఈ వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో 7వ తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న బాలికలకు ప్రతినెలా ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో విద్యార్థినులకు ఏడు రెగ్యులర్ సైజ్, మూడు లార్జ్ సైజ్ న్యాప్కిన్లు అందించేవారని, అయితే బాలికల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ఐదు రెగ్యులర్ సైజ్, ఐదు లార్జ్ సైజ్ శానిటరీ ప్యాడ్లను ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు.
గత ప్రభుత్వ కాలంలో ఈ పథకానికి సంబంధించి రూ.18.96 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ప్రజా ప్రభుత్వం వాటిని పూర్తిగా చెల్లించిందని మంత్రి తెలిపారు. శానిటరీ న్యాప్కిన్ల సరఫరా, నాణ్యతపై నిరంతరం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని కూడా చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి విద్యార్థినుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు.
ఫీడ్బ్యాక్ ప్రకారం 96 శాతం బాలికలు తమకు శానిటరీ న్యాప్కిన్లు అందుతున్నాయని, నాలుగు శాతం మంది అందడం లేదని పేర్కొన్నారని మంత్రి తెలిపారు. నాణ్యత విషయంలో ఒక శాతం మంది బాగోలేదని, 14 శాతం మంది పర్వాలేదని, 85 శాతం మంది బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. అలాగే శానిటరీ న్యాప్కిన్ల అబ్సార్ప్షన్ విషయంలో 84 శాతం మంది బాగుందని, 14 శాతం మంది పర్వాలేదని, రెండు శాతం మంది బాగోలేదని తెలిపారు. సైజ్ విషయంలో 89 శాతం మంది బాగుందని, 11 శాతం మంది సంతృప్తిగా లేరని ఫీడ్బ్యాక్ ఇచ్చారని పేర్కొన్నారు.
ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్ల పంపిణీపై కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతోందని మంత్రి తెలిపారు. దీనిపై పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాలికల్లో ఆరోగ్య అవగాహన పెంచేందుకు ఎన్జీవోలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. అలాగే స్మార్ట్ కార్డ్తో పనిచేసే వెండింగ్ మిషన్లను ఇప్పటికే కేజీబీవీల్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించామని, భవిష్యత్తులో అన్ని పాఠశాలలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
హెచ్పీవీ వ్యాక్సిన్పై కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాక్సిన్ను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారని పేర్కొంటూ, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు క్యాంపెయిన్ తరహాలో ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. బాలికల ఆరోగ్య రక్షణకు ఈ వ్యాక్సిన్ ఎంతో అవసరమని, అందరూ కలిసి దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఇక సభ్యురాలు కావలి గ్రీష్మ మాట్లాడుతూ నెలసరి సమయంలో సరైన హైజీన్ ఉత్పత్తులు అందక చాలా మంది విద్యార్థినులు పాఠశాలలకు గైర్హాజరవుతున్నారని తెలిపారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ, ప్రభుత్వ పాఠశాలలు మరియు కాలేజీల్లో చదువుతున్న బాలికలకు ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
