అమరావతి: గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజలకు చేరవేయడం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధ్యత అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించాలని ఆయన పార్టీ నాయకత్వానికి పిలుపునిచ్చారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లోకేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఇంటికి చేరుకుని ప్రభుత్వం చేసిన పనులను వివరించే కరపత్రాలు, బుక్లెట్లు పంపిణీ చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులను కూడా భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని లోకేష్ సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ప్రతీకగా నిలిచారని, అదే సమయంలో సంక్షేమ రంగంలోనూ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. తల్లికి వందనం, దీపం-2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, రూ.4 వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్, ఆటో డ్రైవర్ల సేవలో పథకం, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు చేరవేయడంలో విఫలమైతే వాటి ప్రభావం తగ్గిపోతుందని లోకేష్ వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2019 మధ్య చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం, ప్రత్యర్థుల ప్రచారం ప్రభావం వల్లే గతంలో రాజకీయంగా నష్టం జరిగిందని గుర్తు చేశారు.
ఈనెల 20వ తేదీ వరకు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో విజయోత్సవ సభలు నిర్వహించాలని, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
ఓటర్ల జాబితా పరిశీలనలో ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని, బూత్ స్థాయి ఏజెంట్లు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని లోకేష్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అవసరమైతే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ వెరిఫికేషన్ సెల్ను సంప్రదించాలని సూచించారు.
