అమరావతి: గత 22 నెలల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ అవార్డు అందుకున్న సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ‘డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో మంత్రులు, అధికారులు ఒక టీమ్గా పనిచేస్తూ లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతున్నామని లోకేష్ తెలిపారు. 2024 ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన తర్వాత, కొత్తవారితో కూడిన జట్టే మంచి ఫలితాలు ఇవ్వగలదని నిరూపించామని అన్నారు. ఈ మార్పుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి నాయకత్వమేనని స్పష్టం చేశారు.
చంద్రబాబునాయుడు విజన్తో ప్రేరణ పొందుతూ, అసాధ్యాన్ని సాధ్యంగా మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని లోకేష్ పేర్కొన్నారు. ఐటీ, పెట్టుబడులు, మౌలిక వసతుల రంగాల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే రాష్ట్రం ముందుకు దూసుకెళ్తోందన్నారు. లిఫ్ట్ పాలసీ వంటి నిర్ణయాల ద్వారా అంతర్జాతీయ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని వివరించారు.
ప్రస్తుతం 800కు పైగా ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తున్నామని, దేశానికి వచ్చే పెట్టుబడుల్లో గణనీయమైన భాగం ఏపీకి వస్తోందని చెప్పారు. 2024-29 పాలనను చరిత్రలో నిలిచేలా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని, టీమ్గా పనిచేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధిస్తామని లోకేష్ పేర్కొన్నారు.
“ఇది కేవలం ప్రారంభం మాత్రమే… ఇంకా పెద్ద లక్ష్యాలు ముందున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.

