రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేసేలా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో సభ్యుడు బొర్రా గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టిందని లోకేష్ చెప్పారు. గతంలో 2018 మరియు 2023 సంవత్సరాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ కొన్ని న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని తెలిపారు. ముఖ్యంగా వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల అమలులో లోపాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడడంతో 2023 నోటిఫికేషన్ నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ కార్యాలయంతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిందని చెప్పారు.
న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారమైతే వెంటనే కొత్త నోటిఫికేషన్ జారీ చేసి మూడు నెలల్లో అవసరమైన పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది అవసరాలపై స్పష్టత కోసం మ్యాన్పవర్ ఆడిట్ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంలో రాజకీయ కోణంలో కొన్ని నియామకాలు జరిగాయని, ప్రస్తుతం యూనివర్సిటీల్లో ఎవరు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అనే విషయంపై సమగ్రంగా పరిశీలన జరగాల్సి ఉందని పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలా అనే అంశంపై కూడా ప్రభుత్వం చట్టపరమైన అభిప్రాయం తీసుకుంటోందని చెప్పారు. ఉద్యోగులకు న్యాయం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి న్యాయ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల వయోపరిమితి అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వం నియామకాల విషయంలో అత్యంత గంభీరంగా వ్యవహరిస్తోందని లోకేష్ పేర్కొన్నారు. గతంలో వచ్చిన నోటిఫికేషన్లలో ఉన్న లోపాలను సరిదిద్దడం వల్లే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేవలం 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. అదే విధంగా విశ్వవిద్యాలయాల్లో కూడా పెండింగ్లో ఉన్న అధ్యాపక పోస్టులను త్వరగా భర్తీ చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
ఉన్నత విద్య రంగంలో పలు సంస్కరణలు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని, కమిషనరేట్లను కూడా మరింత బలోపేతం చేసే దిశగా బిల్లు తీసుకురానున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టుల సమస్యతో పాటు ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని అంశాలపై తాను వ్యక్తిగతంగా సమీక్షలు నిర్వహిస్తున్నానని లోకేష్ తెలిపారు. న్యాయపరమైన అడ్డంకులను తొలగించి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేసి మూడు నెలల్లోనే అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
