దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు. ఆ సెగ, తెలంగాణకీ తాకింది. తెలంగాణలో అప్పట్లో అధికారంలో వున్న బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె జైలుకు వెళ్ళడం కూడా చూశాం.
ఏపీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దదని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ కూడా ఇవ్వడం మరో ఆసక్తికర అంశం. వైఎస్ జగన్ హయాంలో, ఈ లిక్కర్ స్కామ్ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. వేల కోట్లు, దేశం నుంచి అక్రమంగా తరలించారనే ఆరోపణలూ వున్నాయి.
ఈ కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి అరెస్టయ్యారు. సహజంగానే వైసీపీ నుంచి, ‘అన్యాయం, అక్రమం’ అంటూ, ఏడుపులు పెడబొబ్బలు షురూ అయ్యాయి.
వైసీపీ హయాంలో ప్రభుత్వమే, మద్యం దుకాణాల్ని నిర్వహించింది. దాదాపు అన్ని డిస్టిలరీలు, వైసీపీ అధినాయకత్వం కనుసన్నల్లోనే నడిచాయి. పైగా, నకిలీ బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చి మరీ. అబ్బే, అవి నకిలీ బ్రాండ్లు కావు.. అని వైసీపీ బుకాయించిందిగానీ, జనం ఆ నకిలీ బ్రాండ్ల మీద పూర్తి స్పష్టతతో వున్నారు.. వైసీపీకి గత ఎన్నికల్లో పాతరేశారు కూడా.
దేశ వ్యాప్తంగా అందుబాటులో వున్న మద్యం బ్రాండ్లు ఏవీ, రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇదే, మద్యం కుంభకోణం.. అనడానికి ప్రధాన కారణమంటారు రాజకీయ పరిశీలకులు. మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసి, ‘ధరలు పెంచడం వల్ల మద్యం తాగేవారి సంఖ్య తగ్గుతుంది’ అనే పిచ్చి లాజిక్ కూడా వైసీపీ హయాంలోనే తెరపైకొచ్చింది.
ధరలు పెంచి, ఆ తర్వాత తగ్గించి.. వైసీపీ, మద్యం విషయంలో ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రతి రూపాయీ అక్రమంగా వైసీపీ అధినాయకత్వం జేబుల్లోకే వెళ్ళిందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో, ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి అరెస్టు తర్వాత, వైసీపీలో గగ్గోలు తారాస్థాయికి చేరింది. ‘లేని స్కామ్ని వుందని నిరూపించేందుకు కుట్ర..’ అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలు, వైసీపీ ఆర్తనాదాల్లా వినిపిస్తున్నాయన్న చర్చ అంతటా జరుగుతోంది.
వందల కోట్లు కాదు, వేల కోట్ల కుంభకోణం వైసీపీ మద్యం విధానంలో వుందన్న ఆరోపణల్లో తదుపరి అరెస్ట్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనన్న ప్రచారం జరుగుతుండడం కొసమెరుపు.
