ఆయనో సీనియర్ జర్నలిస్ట్.. కానీ, రాజకీయ నాయకుడిలా రాజకీయ విమర్శలు చేస్తాడేంటి.? ఇదే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది.
సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద, ‘అమరావతి మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు’ అంటూ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొమ్మినేని నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఇంకో సీనియర్ జర్నలిస్ట్, ‘అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యలకు కేంద్రం’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదీ అసలు జరిగిన విషయం.
సీనియర్ జర్నలిస్టుగా, చర్చా కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తిగా.. అక్కడికక్కడే, ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సి వుంది కొమ్మినేని శ్రీనివాసరావు. నిజానికి, అలాంటి వ్యాఖ్యలు కృష్ణంరాజు అనే జర్నలిస్టుతో వైసీపీ, సాక్షి మీడియా యాజమాన్యం చేయించాయన్నది ప్రధాన ఆరోపణ అనుకోండి.. అది వేరే సంగతి.
కేసులు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా.. ఇదే విషయమ్మీద. నమోదైన కేసుల తీవ్రత నేపథ్యంలో, పోలీసులు హైద్రాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకున్నారు.
‘పోలీసులు, చాలా మర్యాదగా ప్రవర్తించారు..’ అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు, తన అరెస్టు విషయమై సాక్షి జర్నలిస్టుతో మాట్లాడుతూనే చెప్పారు. అంతలోనే, ‘రెడ్ బుక్ రాజ్యాంగం.. చంద్రబాబుకి నా మీద కక్ష..’ అంటూ పరస్పర విభిన్నమైన వ్యాఖ్యలు చేశారు కొమ్మినేని.
రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో వుంటే, పోలీసులు అరెస్టు సమయంలో నిందితుల మీద ఒకింత అదుపు కోల్పోయి వ్యవహరించాలి. కానీ, అలా జరగలేదు కదా. పోనీ, చంద్రబాబు కక్ష గట్టారు.. అని కొమ్మినేని చెబుతున్నదే నిజమైనా.. పోలీసులు, కొమ్మినేనితో దురుసుగా ప్రవర్తించాలి.
చాలా అంటే, చాలా చాలా మర్యాదగా పోలీసులు తనతో వ్యవహరిస్తున్నారని సాక్షాత్తూ సాక్షి మీడియాతోనే కొమ్మినేని చెప్పారంటే, ప్రభుత్వం సున్నితమైన వ్యవహారాన్ని ఇంకెంత సున్నితంగా డీల్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
అరెస్టు అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావుని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వుంటుంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేరే చర్చ. ఈలోగా వైసీపీ శ్రేణులు, పాతివ్రత్యం ప్రదర్శిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. వైసీపీ హయాంలో అరెస్టులు ఎంత ఘోరంగా జరిగాయో తెలిసీ, ఇప్పుడు నీతులు చెబుతున్నారు వైసీపీ నేతలు.
అరెస్టు విషయంలో పోలీసులపై ‘మర్యాద పూర్వక’ వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారంటే, కొమ్మినేని అనే వ్యక్తి జర్నలిస్టులా కాకుండా, వైసీపీ నాయకుడిగా మాట్లాడుతున్నారనే కదా అర్థం.?
