ఒక టీవీ చానెల్లో తనపై, మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారం తనను తీవ్రంగా బాధించిందని ఆయన అన్నారు. తనకు ఉన్న ఒక్క కొడుకుని కోల్పోయిన బాధ ఇప్పటికీ తీరలేదని, ఆ కొడుకు పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయని చెప్పారు.
నన్ను ఏమైనా అనండి, నాపై ఏదైనా రాయండి కానీ మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు రాసి వారి వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారం పూర్తిగా ముఖ్యమంత్రికే ఉంటుందని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ అధికారులు కాలేరని, వారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా రాయడం సరికాదని ఆయన అన్నారు.
ఈ వ్యవహారంలో నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని మంత్రి చెప్పారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన సందర్భాలు తన జీవితంలో ఉన్నాయని, అద్దె ఇంట్లో ఉంటూ ప్రజలకు సేవ చేశానని గుర్తు చేశారు. తన కొడుకుని కోల్పోయిన రోజే తాను సగం చనిపోయినట్టేనని భావోద్వేగంగా చెప్పారు.
దయచేసి నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని మీడియాను కోరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అయినా ఏది పడితే అదే రాస్తే పై ఉన్న దేవుడు అన్నీ చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
