అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం, రాజకీయ పరిణామాలు వంటి అనేక అంశాలు చర్చించుకున్నట్లు కోమటిరెడ్డి మీడియాకు వెల్లడించారు.
కోమటిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు పాలన ఎప్పుడూ అభివృద్ధి దిశలోనే సాగిందని అభినందించారు. తనను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినందుకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారని, అరకు కాఫీతో పాటు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారని చెప్పారు. “నాకు చంద్రబాబుతో 30 ఏళ్ల పరిచయం ఉంది. ఆయన విజన్ పట్ల నాకు ఎప్పటి నుంచో గౌరవం ఉంది. హైదరాబాద్ హైటెక్సిటీ నేడు ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా నిలవడంలో చంద్రబాబు విజన్ కారణమనే విషయం అందరికీ తెలిసిందే” అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సమ్మిట్ కి రావాలి అని చంద్రబాబు ని కోరాము. సమ్మిట్ కు రావడం పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
మన రాష్ట్రాలకు పరస్పర ప్రయోజనాలు చేకూరేలా బందరు పోర్ట్ ప్రాజెక్ట్ వంటి విషయాలపై కూడా చర్చించామని వెల్లడించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు జరుగుతోందని, ఇలాంటి కార్యక్రమాలకు రెండు రాష్ట్రాల అనుభవాలు ఉపయోగపడతాయని తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ను మరోసారి తీవ్రంగా ఖండించిన కోమటిరెడ్డి, ఆ సమయంలో KTR చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని వ్యాఖ్యానించారు. “కాళేశ్వరంపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీే బలంగా ఉంటుంది. ఇక ప్రజలు గత ప్రభుత్వాన్ని మరిచిపోవాలి” అని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ విషయంలో కూడా కోమటిరెడ్డి స్పష్టమైన అభిప్రాయం వెల్లడించారు. “ప్రతిపక్ష హోదా కంటే ప్రజా సమస్యల కోసం అసెంబ్లీకి రావడం ముఖ్యము. హోదా లేకపోతే అసెంబ్లీలోకి రాము అన్న జగన్ వ్యాఖ్య అసంబద్ధం. ప్రజల మధ్య నిలబడాలి, పోరాడాలి” అని ఆయన అన్నారు.
తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్ కూడా వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకున్న కోమటిరెడ్డి, తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగితే రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. భవిష్యత్తు కార్యక్రమాలపై కూడా చంద్రబాబుతో మంచి చర్చ జరిగిందని తెలిపారు.
