మంత్రి కొడాలి నాని, వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా.? లేదంటే, వ్యతిరేకంగా పనిచేస్తున్నారా.? వైఎస్ జగన్ పట్ల అమితమైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తూనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తూనే.. ఓ వైపు ప్రభుత్వాన్ని, ఇంకో వైపు పార్టీని భ్రష్టుపట్టించేందుకు వ్యూహాత్మకంగా ‘రాజకీయం’ చేస్తున్నారా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా ఆయన హిందూ దేవాలయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని వెనకేసుకొస్తూనే, వైసీపీని, వైసీపీ ప్రభుత్వాన్నీ ఇరకాటంలో పడేస్తున్నారాయన. కొడాలి నాని వ్యాఖ్యల నేపథ్యంలోనే ‘తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్’ వివాదం మరింత ముదిరి పాకాన పడింది.
‘ఆంజనేయస్వామి చెయ్యి విరగ్గొడితే నష్టమేంటి.? అది బొమ్మే కదా.! అంతర్వేది రధం దగ్ధమైతే నష్టమేంటి, ఇన్స్యూరెన్స్ వస్తుందిగా..’ అంటూ వెకిలి వ్యాఖ్యలు చేసిన కొడాలి, ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్గా చేసుకున్నారు. ‘ప్రధాని మోడీని ఆయన భార్యతో కలిసి అయోధ్య రామ మందిరంలో పూజలు చేయమని బీజేపీ నేతలు చెప్పండి.. ఆ తర్వాత వైఎస్ జగన్, తన సతీమణితో కలిసి వెంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాలని డిమాండ్ చేయండి..’ అంటూ కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
తిరుమల విషయంలోనూ, ఇతరత్రా విషయాల్లోనూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానంటున్నారాయన. అన్నట్టు, హిందూ మతాన్ని రెండు కులాలకు పరిమితం చేసే కుట్ర జరుగుతోందంటూ కొడాలి నాని సంచలన విమర్శలు చేసిన విషయం విదితమే. నోటికొచ్చిన బూతులు మాట్లాడటంలో కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడాయన పనిగట్టుకుని హిందూమతంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కొత్త అనుమానాలకు తెరలేపుతోందని బీజేపీ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
‘విగ్రహాన్ని బొమ్మగా చూసేవాడు హిందువే కాడు..’ అంటూ పరిపూర్ణానందస్వామి కొడాలి నాని వ్యాఖ్యలపై ఈ రోజు తీవ్రంగా స్పందించిన విషయం విదితమే. ఏదిఏమైనా, రాష్ట్రంలో ఓ పద్ధతి ప్రకారం హిందూ సమాజంపై దాడి జరుగుతోంది.. హిందూ దేవాలయాలే లక్ష్యంగా నడుస్తున్న ఈ కుట్ర.. రాష్ట్రంలో అశాంతికి కారణమవుతోంది. దురదృష్టవశాత్తూ అధికార పార్టీ నేతలు ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.
844407 965923Yeah bookmaking this wasnt a risky determination outstanding post! . 275938