తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం చిత్ర విచిత్రంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆయన తెలుగుదేశం పార్టీలోనే వున్నారట. తెలుగుదేశం పార్టీ మారే ఆలోచన కూడా ఆయనకి లేదట. కానీ, తెలుగుదేశం పార్టీతో కలిసి వుండటంలేదు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక ప్రజా ప్రతినిథులతో కలిసి పని చేస్తారట. స్థానిక ప్రజా ప్రతినిథులంటే ఎక్కువగా వైసీపీ నేతలే వున్నారు మరి.! 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిందే ముగ్గురు ఎంపీలు. అందులో కేశినేని నాని ఒకరు.
పార్టీకి సంబంధించి ఢిల్లీ స్థాయిలో కీలక పదవిని కేశినేని ఆశించారు, భంగపడ్డారు. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని నాని కుమార్తె పోటీ చేస్తే, ఆమె గ్రూపుకి వ్యతిరేకంగా స్థానిక టీడీపీ నాయకత్వం పనిచేసిందన్న విమర్శలున్నాయి.
తాజాగా, టీడీపీ ఇన్ఛార్జిల నియామకం జరగడంపై కేశినేని నాని ఘాటు విమర్శలు చేశారు. ఇన్ఛార్జిల్ని గొట్టంగాళ్ళతో పోల్చిన కేశినేని నాని, ‘పార్టీ నాకు పొగ పెడుతోందని మీరే అంటున్నారు.. పొమ్మన లేక పొగ పెడుతున్న మాట నిజమే అయితే.. నాకూ మంట పుట్టాలి కదా. వేడి 46 నుంచి 48 డిగ్రీల మధ్యనే వుంది. 100 డిగ్రీలకు మండితే అప్పడు చూపిస్తా నేనేంటో..’ అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించడం గమనార్హం.
‘పార్టీ నుంచి టిక్కెట్ దొరికితే సరే సరి. దొరక్కపోతే, ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి గెలవగల సత్తా నాకుంది.. అదే మాటకు కట్టుబడి వున్నాను. మళ్ళీ మళ్ళీ అదే మాట చెబుతున్నాను..’ అని కేశినేని ధీమా వ్యక్తం చేశారు.
కేశినేని వ్యాఖ్యలపై బెజవాడ తెలుగు తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారు. బొండా ఉమ, బుద్ధా వెంకన్న తదితరులు కేశినేని నాని వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కేశినేని నాని సోదరుడు చిన్ని కూడా అన్నకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే.