మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజాకు పాట రాయడం నిజంగా తన అదృష్టం అన్నారు మరో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా వస్తున్న మూవీ షష్టిపూర్తి. పవన్ ప్రభ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతాన్ని అందించారు. త్వరలో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా, కీరవాణి గెస్ట్ లుగా పాల్గొన్నారు. టీజర్ ను ఇళయరాజా విడుదల చేశారు.
డైరెక్టర్ పవన్ ప్రభ మాట్లాడుతూ.. ‘ఇంత గొప్ప సినిమాకు పనిచేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద వారితో కలిసి పనిచేస్తానని అనుకోలేదు. సినిమాల్లో కీరవాణి, ఇళయరాజ గారి పాటలు తరచూ వినేవాడిని. ఇప్పుడు వారితో పనిచేసే అవకాశం దొరికింది. ఈ సినిమా కుటంబ విలువలను పెంచుతుంది’ అంటూ తెలిపారు.
హీరోయిన్ ఆకాంక్షాసింగ్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఈ మూవీ చాలా స్పెషల్. ఎందుకంటే ఇంత గొప్ప వారితో కలిసి పనిచేస్తున్నాను. వారి పక్కన స్టేజి పంచుకోవడం మర్చిపోలేనను. వారు సినిమాకి పని చేయడం నా అదృష్టం. ఈ సినిమా మాకు గర్వకారణంగా నిలుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
రాజేందప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘నేను సినిమాల్లో ప్లాపులు చూశాను. ‘ప్రేమించు పెళ్ళాడు’ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. అలాంటి టైమ్ లో నాకు ‘లేడీస్ టైలర్’ సినిమా మరో అవకాశాన్ని ఇచ్చింది. ఆ మూవీ గనక ఆడకపోతే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ మూవీ ఇళయరాజా గారి సంగీతం వల్లే హిట్ అయింది. ఆయన ఎంతో మంది హీరోలను పరిచయం చేశారు. ఎన్నో సినిమాలను తన మ్యూజిక్ తోనే హిట్ చేశారు. ఈ సినిమాలో నాకు షష్టిపూర్తి జరిగింది. ఇంత మంచి సినిమాలో నేను అద్భుతమైన పాత్ర చేశాను. కుటుంబాన్ని చక్కగా చూసేలా చేస్తుంది ఈ మూవీ. అందరూ ఈ సినిమాను ఆదరించాలి’ అంటూ చెప్పుకొచ్చారు.
హీరో, నిర్మాత రూపేష్ మాట్లాడుతూ, ‘‘ఇంత పెద్ద వారితో పనిచేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఈ మూవీ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. కుటుంబ పరమైన సినిమా ఇది’ అని చెప్పుకొచ్చారు.
కీరవాణి మాట్లాడుతూ.. ‘‘ఈ మూవీతో నాకు గొప్ప అవకాశం వచ్చింది. ఇళయరాజా గారి మ్యూజిక్ కి పాట రాశాను. ‘ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం.. నీదో, నీవల్ల నాదో ఈ పరవశం. రాగం నీదై, పల్లవి నాదై చరణం, చరణం కలిసిన వేళ పయనాలు ఏ హిమాలయాలకో ’ అనే పాట నిజంగా అద్భుతంగా వచ్చిందంటే ఇళయరాజా గారి సంగీతమే దానికి కారణం. మనసుకు హత్తుకుపోయేలా పాటలను రూపొందించడంలో ఆయన దిట్ట. నేను కాలేజీలో చదువుకునే టైమ్ నుంచే ఇళయరాజగారి సంగతానికి పెద్ద ఫ్యాన్. చెన్నై వెళ్లినప్పుడల్లా ఆయన్ను కలిసేవాడిని. చక్రవర్తి దగ్గర పనిచేసే టైమ్ లో ఇళయరాజా గారిని కలిశాను. నేను కెరీర్ తొలినాళ్లలో ఇళయరాజా గారి ప్రభావంతోనే పని చేశా.. ఈ సినిమాలో ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ మూవీ అందరినీ మెప్పిస్తుంది’ అంటూ తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మాట్లాడుతూ.. ‘‘నేను ఈ సినిమాకు పనిచేస్తున్నా అంటే కొందరు ఆశ్చర్యపోయారు. రాజేంద్ర ప్రసాద్ నన్ను మీరు ఈ ఏజ్ లో కూడా సంగీతం చేస్తున్నారే అని అన్నాడు. ఈ ఏజ్ లో అయితే సంగతం చేయకూడదా. రాజేంద్ర ప్రసాద్ మావాడే. నేను ఈ సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదు. అందరూ చెప్పేశారు. కీరవాణి పాట విన్నప్పుడు నా మీద అతనికి ఉన్న ఆత్మాభిమానం కనిపించింది. ఈ సినిమాకు పనిచేసిన అందరూ నన్ను బాగా చూసుకున్నారు. ఆ దేవుడి దయ వల్ల ఈ సినిమా బాగా ఆడాలి. ఈ సినిమాపై ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలి. నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్లలో పాల్గొనేది చాలా తక్కువ. ‘షష్టిపూర్తి’ సినిమా ద్వారా కొత్తవాళ్లు ప్రయత్నం చేస్తున్నారు అనిపించింది. అందుకే వారిని ప్రోత్సహించడానికి ఇంతదూరం వచ్చాను. ఈ సినిమాను అందరూ ఆదరించాలి’ అంటూ కోరారు.