తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండగ సందర్భంగా తీపి కబురు అందించారు సీఎం కేసీఆర్. ఉద్యోగులకు 2019 జూలై నుంచి రావాల్సిన వాటిలో ఒక డీఏను వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు 5.25 శాతం మేర డీఏ పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 33.53 శాతం నుంచి 38.77 కు పెంచినట్టైంది. 2019 జూలై 1 నుంచి పెంచిన డీఏ అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.
డీఏ విషయంలో ప్రస్తుతమున్న విధానాన్ని మార్చాలని సూచించారు. డీఏను కేంద్రం నిర్ణయంచడంలో ఆలస్యం కావడం వల్ల బకాయిలు పేరుకుపోతున్నాయని అన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి చెల్లించాల్సిన డీఏను రాష్ట్రంలోనే నిర్ణయించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలోనే వార్షిక బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష, వర్షాకాలం పంటల కొనుగోలు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సంబంధిత మంత్రులు, సీఎస్, ఆ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
2020-21 కి సంబంధించి బడ్జెట్ పై సమీక్ష నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నిధులు భారీగా తగ్గిపోయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏయే శాఖలకు ఎంతమేర నిధులు అవసరమో అంచనా వేయాలని సూచించారు.
తెలంగాణలో ఇకపై దసరా సెలవు మరో రోజు పెరుగనుంది. ప్రతి ఏటా దసరా రోజున ఇచ్చే సెలవును ఇకపై దసరా మరుసటి రోజున కూడా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు ఈ ఏడాది 26న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.