కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇవ్వాలన్న హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములను స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు లేకుండా రైతుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిర్ణయంతో తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలోని సుమారు 1,551 మంది రైతులకు పెద్ద ఊరట లభించనుంది. కాకినాడ సెజ్ రైతుల సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా చర్చించగా, ప్రభుత్వం వెంటనే స్పందించింది.
గత ప్రభుత్వ కాలంలో జీవో నెం.12 వచ్చినా, భూముల రిజిస్ట్రేషన్లు జరగక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూములు పేర్లపై లేకపోవడంతో రుణాలు, పథకాల లబ్ధి దక్కలేదు. ఈ విషయాన్ని ఇటీవల శాసన మండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
రైతుల సమస్యపై పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆసక్తి చూపి, రెవెన్యూ శాఖను చొరవ చూపేలా చేశారు. చివరకు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని రైతుల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిర్ణయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
