రాజధాని ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. నగరంలోని జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు, కొమ్మినేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని ఏపికి తరలించారు.
ఈ కేసు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది. రాజధాని రైతులు మరియు మహిళలు చేసిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించారు. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, అసభ్య వ్యాఖ్యలపై కొమ్మినేని, జర్నలిస్టు కృష్ణంరాజు, అలాగే సాక్షి ఛానల్ యాజమాన్యంపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.
ఈ కేసు నేపథ్యంగా సాక్షి ఛానల్లో జరిగిన చర్చలో, జర్నలిస్టు కృష్ణంరాజు “అమరావతి వేశ్యల రాజధాని” అనే శబ్దాలను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, చర్చను నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలను అడ్డుకోకుండా చర్చను కొనసాగించినట్టు పోలీసుల ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఇక కృష్ణంరాజు ప్రస్తుతం గోప్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన విజయవాడలోని అయోధ్యనగర్లో ఉన్న ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
