ఎన్నికలు సమీపిస్తున్నాయ్.! ఔను, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయ్.! రెండూ ఒకేసారి జరుగుతాయా.? విడివిడిగా జరుగుతాయా.? అన్న కన్ఫ్యూజన్ ఒక్కటే వుంది.!
రెండు రాష్ట్రాల్లోనూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు. తెలంగాణలో పది నుంచి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ జనసేన శ్రేణులు యాక్టివ్ అయ్యాయి. ఓ ఎంపీ స్థానం మీద కూడా జనసేన ఫోకస్ పెట్టింది.
ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, ‘అధికారంలోకి వస్తాం’ అనే నినాదంతో జనసేన పార్టీ ముందడుగు వేస్తోంది. అయితే, టీడీపీతో పొత్తుకు సమాయత్తమవుతున్న దరిమిలా, అన్ని స్థానాల్లోనూ జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం వుండదు.
టీడీపీతో పొత్తు గనుక కుదరకపోతే, అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేయక తప్పదు. అప్పుడు కేవలం బీజేపీతోనే జనసేన ముందడుగు వేయాల్సి వుంటుంది. దానికి సైతం జనసేన శ్రేణులు సిద్ధంగానే వున్నాయి. మెజార్టీ జనసైనికులు టీడీపీతో పొత్తుని కోరుకోవడంలేదు.
అయితే, అధికార వైసీపీని గద్దె దించడం కోసం ‘వైసీపీ వ్యతిరేక ఓటు’ చీలకూడదు గనుక, టీడీపీతో పొత్తు దిశగా జనసేనాని వ్యూహ రచన చేశారు. అంతా బాగానే వుందిగానీ, జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులెవరు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్.
వైసీపీ నుంచి ఈసారి 50 శాతానికి పైగా అభ్యర్థులు మారొచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమందికి సీట్లు దొరుకుతాయో తెలియని పరిస్థితి. టీడీపీ కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ఆ రెండు పార్టీల పరిస్థితి వేరు, జనసేన పరిస్థితి వేరు.
వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తే, కింది స్థాయిలో ఆయా అభ్యర్థులు వేగంగా పని చేసుకోవడానికి వీలవుతుంది. మరి, జనసేనాని ఆ దిశగా కీలక నిర్ణయం త్వరలో తీసుకుంటారా.? వేచి చూడాల్సిందే.