పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సహా, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వరకు.. గడచిన రెండు నెలల్లో జనసేన ఎమ్మెల్యేల పని తీరు ఎలా వుంది.? అన్న విషయమై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఒకే ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచారు.. అయితే, ఆయన ఆ తర్వాత అప్పటి అధికార వైసీపీలోకి దూకేశారు. కానీ, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేగా, ఇద్దరు ఎంపీలుగా గెలిచారు. టీడీపీ – బీజేపీతో కలిసి జనసేన పార్టీ రాష్ట్రంలో అధికారం పంచుకుంది. కేంద్రంలోనూ ఎన్డీయే కూటమిలో మిత్రపక్షంగా వుంది జనసేన.
ఇంతకీ, రాష్ట్రంలో జనసేన ఎమ్మెల్యేల పని తీరు ఎలా వుంది.? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా, మొత్తంగా ముగ్గురు మంత్రుల పని తీరు ఎలా వుంది.? ఈ విషయమై జనసైనికులు ఏమనుకుంటున్నారు.? సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు.?
నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మిగతా ఎమ్మెల్యేలతో పోల్చితే చాలా దూకుడుగా వున్నారన్నది జనసైనికుల్లో వినిపిస్తున్న వాదన. మహిళా ప్రజా ప్రతినిథి అయి వుండీ, ఆమె ప్రదర్శిస్తున్న దూకుడుకి జనసైనికులు అదనపు మార్కులు ఇస్తున్నారు.
కాగా, ఓ వైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే, ఇంకో వైపు తనను గెలిపించిన పిఠాపురంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ చూపిస్తున్న చిత్తశుద్ధికి సాధారణ ప్రజానీకం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇటు మంత్రిగానూ, అటు ఎమ్మెల్యేగానూ.. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సైతం, అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే అని కాదు.. ఒకరు తక్కువ, ఇంకొకరు ఎక్కువ.. అని కూడా కాదు.. మొత్తంగా చూస్తే, జనసేన ప్రజా ప్రతినిథులంతా, తమ బాధ్యతల్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారన్నది ఆయా నియోజకవర్గాల నుంచి వినిపిస్తోన్న వాదన.
కాగా, ఒకరిద్దరు జనసేన ఎమ్మెల్యేలని వైసీపీ టార్గెట్ చేయడం, ఆ ఎమ్మెల్యేల పనితీరుపై ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ చూపించలేకపోతోంది. అయితే, ఆయా నియోజకవర్గాల్లో కొంత అలజడికి అయితే వైసీపీ మార్కు రాజకీయాలు కారణమవుతున్నాయన్నది నిర్వివాదాంశం.
టీడీపీ – బీజేపీకి చెందిన క్యాడర్తో జనసేన ప్రజా ప్రతినిథులకి ఎక్కడా పెద్దగా ఇబ్బందులు కనిపించడంలేదు. ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు అధినేత దిశానిర్దేశం.. టీడీపీ, బీజేపీతో జనసేన శ్రేణులు స్నేహపూర్వకంగా కలిసిపోవడానికి కారణమవుతోంది.
అసలు గెలుస్తారా.? లేదా.? అన్న అనుమానాలున్న జనసేన అభ్యర్థుల్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఒకరు. ఆయన కూడా అంచనాలకు మించి, పనితీరు ప్రదర్శిస్తున్నారు. తిరుపతిలో మాత్రం, జనసేనలోనే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తోంది. రైల్వే కోడూర్ విషయంలోనూ ఇదే భావన వ్యక్తమవుతోంది.
రాజమండ్రి, నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఎమ్మెల్యేలతోపాటు, ఉమ్మడి విశాఖలోనూ జనసేన ఎమ్మెల్యేలకు స్థానిక ప్రజల నుంచి మంచి మార్కులే పడుతున్నాయి.
ఇదిలా వుంటే, ‘ఉచిత ఇసుక’ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేల మీద బురద చల్లుతున్నట్లే, జనసేన ఎమ్మెల్యేల మీద కూడా బురద చల్లేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలూ చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన – బీజేపీ – టీడీపీ శ్రేణుల మధ్య పుల్లలు పెట్టేందుకు వైసీపీ, వైసీపీ అను‘కుల’ మీడియా చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతానికైతే బెడిసికొడుతూనే వున్నాయి.