తెలంగాణ పరిధిలో విలీన ప్రక్రియ అనంతరం కొత్తగా నిర్ణయించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రాంతంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేన ప్రధాన నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక అవగాహన సమావేశం ఈరోజు సాయంత్రం కూకట్పల్లి జనసేన కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశానికి సైబరాబాద్ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసేన వీర మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొత్తగా ఏర్పడిన CMC పరిధిలో పార్టీ బలపర్చడం లక్ష్యంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని నాయకత్వం పిలుపునిచ్చింది.
సభ్యత్వ నమోదు ప్రాధాన్యత, నమోదు విధానం, ఎదురయ్యే సాంకేతిక అంశాలపై ప్రేమ్ కుమార్ కార్యకర్తలకు వివరంగా అవగాహన కల్పించారు. ప్రతి డివిజన్ నుంచి కనీసం ఐదు వేల మందిని సభ్యులుగా చేర్చే అవకాశముందని, జనసైనికులు ఆ దిశగా లక్ష్యంతో పని చేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా ప్రాధాన్యత గల నాయకుడిగా ఎదిగిన విధానాన్ని ప్రస్తావించారు. సనాతన ధర్మ పరిరక్షణలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయనకు అన్ని రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారని తెలిపారు. జనసేన కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీ కాదని, సభ్యత్వ నమోదు విషయంలో ప్రాంతం ఎలాంటి అడ్డంకి కాదని కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు.
క్షేత్ర స్థాయిలో అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరాన్ని ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు. ఒక్కో నాయకుడు మరింత మంది నాయకులను తయారు చేయాలని, అన్ని బాధ్యతలను తానే తీసుకోవాలని భావిస్తే ఫలితం ఉండదని చెప్పారు. విస్తృత స్థాయిలో నాయకత్వ వికాసం జరగాలని సూచించారు.
సభ్యత్వ నమోదు సమయంలో ఇప్పటికే చేర్చిన సభ్యులకు ఇన్సూరెన్స్ విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని కార్యకర్తలు తెలియజేశారు. దీనిపై స్పందించిన ప్రేమ్ కుమార్, ఇకపై అలాంటి సమస్యలు ఉండకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్సూరెన్స్ లబ్ధిదారులకు సహాయం అందేవరకు స్థానిక నాయకులు కూడా బాధ్యతగా ఫాలోఅప్ చేయాలని సూచించారు.
కొత్త సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు ఇప్పటికే ఐటీ టీమ్ పని చేస్తున్నదని తెలిపారు. అన్ని డివిజన్లలో ఉత్సాహంతో ముందుకు సాగి భారీ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, కుత్బుల్లాపూర్ జనసేన పార్టీ ఇంచార్జి నందగిరి సతీష్, పటాన్ చెరు పార్టీ ఇంచార్జి రాజేష్, మణికొండ పార్టీ ప్రతినిధి శ్రీనివాస్ లు ప్రసంగించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచనలు అందించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసేన పార్టీ విస్తరణకు ఇది కీలక దశగా నాయకులు అభిప్రాయపడ్డారు.
