ఆంద్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ సారి రొటీన్కి భిన్నంగా వ్యవహారం తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి, వైఎస్ జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆ రివర్స్ టెండరింగ్ కారణంగా నవయుగ సంస్థ కోల్పోయిన అవకాశాన్ని చాలా తెలివిగా మేఘా సంస్థ దక్కించుకుంది.
గతంలో మేఘా సంస్థపై అవినీతి ఆరోపణలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, చాలా చిత్రంగా పోలవరం ప్రాజెక్టు పనుల్ని అదే సంస్థకు కట్టబెట్టింది. ఇప్పుడు ఈ మేఘా సంస్థ డైరెక్టర్ కృష్ణా రెడ్డిపై ఐటీ సోదాలు షురూ అయ్యాయి. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ చర్చకు తెరలేపింది. సాధారణంగా ప్రాజెక్టుల టెండరింగ్ అంటే, ఎస్కలేషన్స్ ఉంటాయి. తగ్గించి పనులు చేస్తామంటూ ఎవరూ ముందుకు రారు.
మరి మేఘా సంస్థ కోట్లాది రూపాయలు తగ్గించుకుని ఎలా టెండరింగ్లో పాల్గొంది. ఒకే సంస్థ మాత్రమే ఎందుకు రేసులో నిలబడి గెలిచింది. ఈ ప్రశ్నలు అందర్నీ ఆలోచింపచేస్తున్నాయి. రివర్స్ టెండరింగ్పై కేంద్రానికి అభ్యంతరాలున్నాయి. ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఏపీ నేతలు ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ని సందర్శిస్తున్నారు. ఇదే సమయంలో మేఘా సంస్థలో ఐటీ సోదాలు జరగడాన్ని జనం ఆసక్తిగా గమనిస్తున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం తెర వెనుక లాలూచీలతో మేఘా సంస్థని రంగంలోకి దించిందని తెలుగు దేశం పార్టీతో పాటు, బీజేపీ సైతం ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, ఐటీ సోదాపై ఇటు అధికారులు కానీ, అటు మేఘా సంస్థ నుండి కానీ, ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. సాధారణ ఐటీ సోదాలు మాత్రమే అనే వాదన ఓ వైపు. ఇదంతా పోలవరం ఎఫెక్టేనన్న ప్రచారం మరోవైపు జరుగుతోంది.