ఆయనేమీ సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు.. ప్రస్తుతం అత్యంత గౌరవ ప్రదమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆయన. ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా శాసన సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసన సభ్యులు, మండలి సభ్యుల ఆట విడుపు నిమిత్తం ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో ప్రజా ప్రతినిథులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆట అన్నాక అపశృతులు మామూలే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, క్రికెట్ ఆడుతూ పరుగు తీసే క్రమంలో కింద పడిపోయారు.
కింద పడ్డ రఘురామకృష్ణ రాజుకి గాయాలయ్యాయి. ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు, ఫ్రాక్చర్స్ అయినట్లు వైద్యులు గుర్తించారు, శస్త్ర చికిత్స కూడా చేశారు. ఫ్రాక్చర్కి సంబంధించిన ఎక్స్రే వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, గతంలో వైసీపీ ఎంపీగా వున్న సమయంలో రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగింది. తనను దారుణంగా కొట్టారంటూ రఘురామ స్వయంగా ఆరోపించారు, ఈ మేరకు కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో పలు అరెస్టులు కూడా జరిగాయి.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడారు రఘురామకి ఫ్రాక్చర్ అవడానికి సంబంధించి. ఒకవేళ రఘురామ ఆరోపిస్తున్నట్లుగా కస్టోడియల్ టార్చర్ జరిగి వుంటే, ఆయనకున్న బోన్ డెన్సిటీకి, ఎప్పుడో అవి నుజ్జునుజ్జు అయిపోయి వుండాలని వ్యాఖ్యానించారు.
ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి.? అన్న చర్చ అంతటా జరుగుతోంది. ఎంత ద్వేషంతో ఆ ఐపీఎస్ అధికారి రగిలిపోతున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ రాష్ట్ర ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు. పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేసే క్రమంలో, చట్టానికి దొరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారన్నది నిర్వివాదాంశం.
బోన్ డెన్సిటీ అంశాన్ని ప్రస్తావిస్తూ, పరోక్షంగా పోలీసు వ్యవస్థపైనే ప్రజల్లో ఏహ్యభావం కలిగేలా సదరు ఐపీఎస్ అదికారి వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అన్నట్లు రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఓ పోలీస్ అధికారి, వైసీపీ అధికారం కోల్పోగానే బీహార్కి వెళ్ళిపోవడం, అక్కడ ఆయన్ని ఏపీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేస్తే, బీహార్ ప్రభుత్వం ఆయనకి రక్షణ కల్పించడం తెలిసిన విషయాలే.
