హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన రాజ భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందీ భాషపై తన అభిప్రాయాలను సరళమైన శైలిలో పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మాతృ భాష అమ్మ అయితే, రాజ భాష హిందీ పెద్దమ్మ లాంటిదని చెప్పారు. ఇంట్లో మాట్లాడటానికి మన భాష ఉంటే, దేశవ్యాప్తంగా సమాజం కోసం హిందీ అవసరమని అన్నారు. హిందీని వ్యతిరేకించడం, భవిష్యత్ తరాల అభివృద్ధికి అడ్డుకావడమేనన్నారు.
మన దేశంలో భాషలు, సంస్కృతులు ఎన్నో ఉన్నా.. దేశాన్ని ఏకం చేయగల సామర్థ్యం హిందీకి మాత్రమే ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, సోషల్ మీడియా పాపులారిటీ కోసం హిందీని వాడతాం కానీ, నేర్చుకోవాలంటే మాత్రం వెనుకాడుతున్నాం అన్నది ఆయన అభిప్రాయం.
హిందీ భాషపై వ్యతిరేకతను చిల్లర రాజకీయాల కోణంలో చూడొద్దన్నారు. హిందీ మనది అన్న భావన పెంచుకోవాలని, దాన్ని అంగీకరించడం ఓడిపోవడం కాదు, కలసి ముందుకెళ్లడం అని స్పష్టంచేశారు. హిందీ నేర్చుకోవడం మన భవిష్యత్తుకి దోహదపడుతుందని చెప్పారు.
విద్య, వైద్యం, వ్యాపారాల్లో భాషల అడ్డంకులు తొలగించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా హిందీ ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ వివరించారు. చివరగా, “నా హిందీ భాషా ప్రేమకి నిదర్శనంగా ‘ఖుషీ’ సినిమాలో ‘ఏ మేరా జహా…’ పాటను వేశా” అని గుర్తు చేశారు
