దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలిక పాటి జల్లులు పడతాయని చెప్పింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆయా జిల్లాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ ఎండి రోణంకి కూర్మనాథ్ సూచించారు.
ఇక ఉత్తర కోస్తా, యానాం పరిసర ప్రాంతాల్లో సాధారణ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నాలుగు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయని చెప్పింది.