సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పలు అంతర్జాతీయ కంపెనీలతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎపిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, డేటా సెంటర్లు, క్రియేటర్ అకాడమీ వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
క్రియేటర్ అకాడమీ ఏర్పాటు: సింగపూర్ షాంగ్రీలా హోటల్లో టెజరాక్ట్ US Inc. ప్రెసిడెంట్ తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఎపి ప్రభుత్వం ఐటి కార్యదర్శి కాటంనేని భాస్కర్ ల సమక్షంలో ఎంఓయూ కుదిరింది. ఈ క్రియేటర్ అకాడమీ ద్వారా కంటెంట్ తయారీకి శిక్షణ, వనరులు, సాంకేతిక సహాయం అందించబడనుంది. గూగుల్ సంస్థ పాఠ్యాంశాలు, సాంకేతిక మద్దతు అందిస్తే, టెజరాక్ట్ సంస్థ భౌతిక వసతులు, నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది.
విశాఖలో డేటా సిటీ & చిప్ డిజైనింగ్ కేంద్రం: గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్తో సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, విశాఖపట్నంలో డేటా సిటీకి అవసరమైన మౌలిక వసతులు పూర్తయినట్లు తెలిపారు. గూగుల్ చిప్ డిజైనింగ్ సెంటర్ను కూడా విశాఖలో ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, గూగుల్ లేదా దాని భాగస్వామి సంస్థలు ఎపిలో సర్వర్ సప్లై చైన్, రిపేర్ & మెయింటెనెన్స్ హబ్ స్థాపించవచ్చని అన్నారు.
ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు: మురాటా ఎలక్ట్రానిక్స్ ఎండి హిరోయికి నివాతో భేటీలో ఎపిలో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ స్థాపించాలని లోకేష్ ఆహ్వానించారు. ఎలక్ట్రానిక్స్ 4.0 పాలసీ కింద పలు ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తిరుపతి, విశాఖలో ఇప్పటికే పలు కంపెనీలు యూనిట్లు నెలకొల్పాయని, మురాటా వంటి సంస్థలు కూడా ఎపిలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్: క్యారియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాతో భేటీలో ఎపిలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు HVAC సిస్టమ్స్ అమలు, టైర్-2, టైర్-3 నగరాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల నిల్వ కోసం కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్: ఎస్.టి. టెలీమీడియా ఇన్వెస్టిమెంట్స్ ఇండియా హెడ్ రీతూ మెహ్లావత్తో భేటీలో విశాఖపట్నంలో గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. రీతూ మెహ్లావత్ ఈ ప్రతిపాదనను సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని తెలిపారు.
బిజినెస్ రౌండ్ టేబుల్ మీటింగ్: బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ:
ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఎఐ, ఫిన్టెక్ రంగాల్లో ఎపి పెట్టుబడులకు వ్యూహాత్మక కేంద్రం.
974 కి.మీ తీరప్రాంతం, పోర్టులు, ఎయిర్ కనెక్టివిటీ, విద్యా వనరులు ఉన్నాయని వివరించారు.
ఎలక్ట్రానిక్స్ రంగంలో 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్ 4.0 పాలసీని ప్రకటించామని చెప్పారు.
టిసిఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఎపిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు.
స్టార్టప్లను ప్రోత్సహించి, నాలెడ్జి బేస్డ్ ఎకానమీ సాధన లక్ష్యంగా గ్లోబల్ కంపెనీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ, “ఎపి వ్యాపార సౌలభ్యం, పారదర్శక విధానాలతో పెట్టుబడిదారులకు పూర్తి మద్దతు అందిస్తుందని” స్పష్టం చేశారు.
