‘సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి.. సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం..’ అని విపరీత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్పై ఆయన పేరు ప్రస్తావించకుండానే తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.!
‘కొందరు సనాతన ధర్మాన్ని అంతం చేస్తామంటున్నారు.. కానీ, వాళ్ళే అంతమైపోతారు..’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అక్కడి నుంచి తమిళనాడులో రాజకీయ చర్చలు, పవన్ కళ్యాణ్ కేంద్రంగా సాగడం మొదలైంది.
తమిళనాడులో తెలుగు హిందూ ఓటర్ల సంఖ్య ఎంత.? వారిపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రభావమెంత.? పవన్ కళ్యాణ్ని బీజేపీ, తమిళనాడులో తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలనుకుంటోందా.? ఏఐఏడీఎంకే – బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ బీజం వేస్తున్నారా.? ఇలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
బీజేపీ తరఫున అన్నామలై, తమిళనాడులో చాలా యాక్టివ్గా వున్నారు. తమిళనాడులో ఒకప్పుడు బీజేపీకి అసలు ఓటు బ్యాంకు అనేదే లేదు. ప్రస్తుతం పది శాతానికి కాస్త అటూ ఇటూగా మారిందంటే, అది అన్నామలై ప్రభావం వల్లనే. ఆ అన్నామలైకి తోడు, పవన్ కళ్యాణ్ ‘సనాతన ధర్మ పరిరక్షణ’ పోరాటం, తమిళనాడులో తెలుగు హిందూ ఓటర్లనే కాదు, సంప్రదాయ తమిళ హిందూ ఓటర్లనూ బీజేపీ వైపు చూసేలా చేస్తోంది.
నిజానికి, ఏఐఏడీఎంకే – డీఎంకే.. ఈ రెండు పార్టీల భావజాలం కూడా దాదాపు ఒక్కటే. అదే పెరియార్ భావజాలం. అయినాగానీ, సనాతన ధర్మం విషయంలో డీఎంకేతో పోల్చితే, ఏఐఏడీఎంకే కాస్త బెటర్. ఆ ఏఐఏడీఎంకే, జయలలిత మృతితో బలహీనపడినా, ఆ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఇంకా బలంగానే వుంది.
తమిళ నటుడు విజయ్ కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తున్న దరిమిలా, తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. అన్నామలై లాంటి యంగ్ లీడర్, విజయ్ లాంటి స్టార్ హీరో.. బలమైన ఓటు బ్యాంకు వున్న డీఎంకే, ఏఐఏడీఎంకే.. ఇన్ని రాజకీయ సమీకరణాల నడుమ, తమిళనాడు రాజకీయాల్లో సంప్రదాయ తెలుగు హిందూ ఓటు బ్యాంకు కూడా కీలకంగా మారబోతోంది.
కొన్ని నియోజకవర్గాల్లో ఈ ఓటు బ్యాంకు పది నుంచి పన్నెండు శాతం వరకూ వుండొచ్చన్నది ఓ అంచనా. అదే ఇప్పుడు డీఎంకే పార్టీకి పెద్ద తలనొప్పిలా మారబోతోందన్నది తమిళ రాజకీయ విశ్లేషకుల అంచనా.
అన్నట్టు, తెలుగు మీడియాతో పోల్చితే తమిళ మీడియా మరింత భిన్నం. డీఎంకే కనుసన్నల్లోనే మెజార్టీ మీడియా సంస్థలు పని చేస్తున్నాయ్. అందుకే, సోషల్ మీడియా వేదికగా తమిళ జనాలు.. సనాతన ధర్మం గురించీ, పవన్ కళ్యాణ్ గురించీ పాజిటివ్గా స్పందిస్తుండడం గమనార్హం.
ఈ తమిళ రాజకీయాలు మనకెందుకు.? అన్న చర్చ కొందరు జనసైనికుల్లోనూ జరుగుతున్నా, సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యతను భుజానికెత్తుకున్న పవన్ కళ్యాణ్ గురించి దేశవ్యాప్తంగా సగటు హిందువులంతా చర్చించుకుంటూనే వున్నారు. ఆయన తెగువని కొనియాడుతూనే వున్నారు.
కొసమెరుపేంటంటే, తమిళనాడులోని తెలుగు హిందువులే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని తమిళ హిందువుల దృష్టిలోనూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టార్డమ్ అనూహ్యంగా పెరిగిపోయిందిప్పుడు.! సనాతన ధర్మ పరిరక్షణ కోసం నినదిస్తూనే, ఇతర మతాల్ని సైతం అంతే బాధ్యతగా గౌరవిస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. ఆ కోణంలోనూ ఆ వర్గాల్లోనూ ప్రశంసల్ని పొందుతున్నాయి.