రేపల్లె అత్యాచార ఘటన, రాష్ట్రంలో పోలీసుల కొరత, గడప గడపకూ వైసీపీ కార్యక్రమం వాయిదా అంశాలపై రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. రేపల్లె అత్యాచార ఘటనకు నిందితులు అతిగా మద్యం సేవించడమే కారణమని అన్నారు. మొదట బాధితురాలి భర్త వద్ద దొంగతనానికి యత్నించి.. మద్యం మత్తులో అత్యాచారానికి ఒడిగట్టారని అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న వరుస అకృత్యాలకు పోలీసుల కొరత కారణమా..? అనే ప్రశ్నకు బదులిస్తూ.. రాష్ట్రంలో పోలీసుల కొరత ఉన్న మాట వాస్తవమేనని.. రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలకు పోలీసుల కొరత కారణం కాదని అన్నారు. పోలీసు కొరతపై త్వరలో సీఎం జగన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
గడప గడపకూ వైసీపీ కార్యక్రమం వాయిదాపై స్పందిస్తూ.. తరచుగా రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల వల్లే అని వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టిపారేశారు. ప్రజలకు అందించిన సంక్షేమ పధకాల వివరాలు వారికి వివరించేందుకు అవసరమైన సచివాలయాల నుంచి డేటా రావడం ఆలస్యం కావడంవల్లేనని అన్నారు.