NTR Statue: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేయాలని భావించిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈమేరకు స్టే ఆర్డర్స్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలోని లకారం చెరువు మధ్యలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకుండా ఉత్తర్వులివ్వాలని యాదవ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల విగ్రహాల ఏర్పాటుకై సుప్రీంకోర్టు ఆదేశాలను వారు హైకోర్టుకు విన్నవించారు. అయితే.. విగ్రహంలో పిల్లన గ్రోవి, పింఛను తొలగించినట్టు అదనపు ఏజీ వాదనలు వినిపించారు.
ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి ఆదేశాలిచ్చే వరకూ విగ్రహాన్ని ఏర్పాటు చేయరాదని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు.