హెరిటేజ్ ఫుడ్స్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి విడుదల చేసిన వీడియో ఇప్పుడు రాజకీయ, కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ సంస్థపై సోషల్ మీడియా, రాజకీయ వేదికలపై వ్యాప్తిలో ఉన్న ఆరోపణలకు సమాధానంగా ఈ వీడియోను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. 33 ఏళ్లుగా ప్రతి ఇంటికీ తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందించడమే హెరిటేజ్ లక్ష్యమని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. చిన్న స్థాయిలో రూ.4 కోట్ల మూలధనంతో ప్రారంభమైన హెరిటేజ్ సంస్థ నేడు రూ.4,000 కోట్ల స్థాయికి ఎదిగినా నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదని పేర్కొన్నారు.
హెరిటేజ్ ఉత్పత్తులు వినియోగదారుల ఇళ్లకు చేరుకునే ముందు 25 దశల నాణ్యత పరీక్షలు పూర్తయ్యాకే పంపిణీ చేస్తామని వీడియోలో వెల్లడించారు. 500 మందికి పైగా నిపుణులు నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తూ ఉత్పత్తి ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తున్నారని తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు మూడు లక్షల మంది పాడి రైతులతో సంస్థ అనుసంధానమై ఉందని, రైతులకు న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు, పారదర్శక లావాదేవీలు అనే సూత్రాలతో ముందుకు సాగుతోందని వివరించారు. రైతుల సాధికారతే హెరిటేజ్ విధానంలో కేంద్రబిందువని, ఉత్పత్తుల నాణ్యతతో పాటు రైతుల సంక్షేమానికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
ఇటీవలి రాజకీయ ఆరోపణల నేపథ్యంలో హెరిటేజ్ ప్రతిష్టపై సందేహాలు కలిగేలా ప్రచారం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లోనే “చూసిందే నమ్మండి” అనే సందేశంతో విడుదలైన వీడియో ప్రజలకు వాస్తవాలను చూపించే ప్రయత్నంగా మారింది. సంస్థ పనితీరు, నాణ్యత ప్రమాణాలు, రైతులతో ఉన్న సంబంధాలపై స్పష్టత ఇచ్చేలా ఈ వీడియో రూపొందించారని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. వీడియో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విస్తృత స్పందన కనిపిస్తోంది. హెరిటేజ్ బ్రాండ్ విశ్వసనీయతను ప్రజలే తూచిచూడాలన్న ఉద్దేశంతో ఈ వీడియోను పూర్తిగా చూడాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.
